విధాత: కర్ణాటక రాజధాని బెంగళూరులో నిత్యం రద్దీగా ఉండే ఎయిర్పోర్టు రోడ్డుపై దొడ్డజాల ప్రాంతంలో ఉదయం వేళ పలు వాహనాలు ఢీకొన్నాయి. దట్టమైన పొంగ మంచు కారణంగా ప్రమాదాలు జరిగినట్టు తెలుస్తున్నది. ఒకదాని వెంట మరొకటి కార్లు పరస్పరం ఢీకొట్టడంతో కార్లు కుప్పగా పేరుకుపోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది.
సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అనేక కార్ల ముందు వెనుక భాగాలు ధ్వంసమైనట్టు చిత్రాల్లో కనిపిస్తున్నది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలు తొలగించారు. వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.