విధాత: మునుగోడు ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో రవికుమార్ గౌడ్ దంపతులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రవికుమార్ గౌడ్కు, ఆయన భార్య కళ్యాణికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జ్యోతి చండూరు ఎంపీపీగా కొనసాగుతోంది. ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఉన్నారు.
ప్రస్తుతం కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ గెలుపు కోసం టీఆర్ఎస్లో చేరేందుకు ముందుకు వచ్చిన పల్లె రవికుమార్కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమ కాలం నుంచి మాతో కలిసి పని చేసిన పల్లె రవికుమార్ మళ్లీ టీఆర్ఎస్ కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉందని, పాత మిత్రుడికి భవిష్యత్తులో ఖచ్చితంగా మరిన్ని మంచి రాజకీయ అవకాశాలను పార్టీ కల్పిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
అనంతరం రవి కుమార్ మాట్లాడుతూ ఈరోజు కేటీఆర్ గారి సమక్షంలో మేము అన్ కండిషనల్గా టీఆర్ఎస్ పార్టీలో చేరామని తెలిపారు. చండూరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలన్న ప్రధానమైన ప్రజల కోరికను కేటీఆర్కి తెలియజేశానని, కేటీఆర్ గారు ఇందుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం మా వంతు కృషి చేస్తామని అన్నారు.