Ponnam |
లోక్ సభ బరిలో అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి?
విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. ఈమేరకు శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో పార్టీ హైకమాండ్కు ఆయన దరఖాస్తు చేయనున్నారు. 2009 ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కరీంనగర్ ఎంపీగా గెలిచిన పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
తెలంగాణ బిల్లు ఆమోదం సందర్భంగా లోక్సభలో పెప్పర్ స్ప్రే దాడికి గురయ్యారు. కరీంనగర్ లో ఎఫ్ఎం రేడియో స్టేషన్ ప్రారంభోత్సవం, తిరుపతికి రైలు సర్వీసు, పాస్పోర్టు కార్యాలయం ఏర్పాటు, ఎంసీహెచ్సీ ఆస్పత్రి, కరీంనగర్ లో సిటీ బస్సు సర్వీసులను ప్రవేశపెట్టడం, పలు పాఠశాలలకు భవనాల నిర్మాణంతో పాటు నియోజకవర్గంలో ఎంపీగా అనేక అభివృద్ధి పనులు చేపట్టారు.
వరుస పరాజయాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పొన్నం టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ చేతిలో ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. తిరిగి 2019లో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల నుంచి పోటీ చేసినా మళ్లీ మూడో స్థానంతోనే సరి పెట్టుకున్నారు.
2019 ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ సిటింగ్ ఎంపీ బీ వినోద్ కుమార్పై విజయం సాధించగా, పొన్నం ప్రభాకర్ మూడో స్థానంలో నిలిచారు. అనేక పరాజయాలను ఎదుర్కొన్న తరువాత, ప్రభాకర్ ఎన్నికలలో పోటీ చేయడానికి సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. గౌడ సామాజికవర్గంతో సహా బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్న హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ ఇందుకు అనువైనదని ఆయన భావించారు.
కన్నేసిన అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ మాజీ నేత అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి ఇక్కడి నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. దేశంలోనే అగ్రగామి సహకార సంస్థ అయిన ముల్కనూర్ సహకార బ్యాంకు, సొసైటీ అధ్యక్షునిగా సుదీర్ఘకాలం కొనసాగుతున్న ప్రవీణ్ రెడ్డి జిల్లాలో మంచి గుర్తింపు పొందారు.
మృదుస్వభావి, అవినీతి రహితుడు, రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఆయన గత కొన్ని నెలలుగా నియోజకవర్గం పైనే దృష్టి సారించి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రవీణ్ రెడ్డిని నిలిపితే బాగుంటుందని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు సమాచారం. ప్రవీణ్ రెడ్డి కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.