విధాత, హైదరాబాద్ :బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కేసు విచారణలో సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు డైడ్ లైన్ విధించింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణను మరో మూడు వారాల పాటు వాయిదా వేసింది. అప్పటిలోగా విచారణ ప్రక్రియను పూర్తి చేయడంలో సుప్రీం కోర్టు ఆదేశాలను స్పీకర్ పాటిస్తారని ఆశిస్తున్నామని సీజేఐ సూర్యకాంత్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మూడు వారాల తర్వాత మళ్లీ విచారణ చేపడతామని పేర్కొంది. అప్పటికి కోర్టు ఆదేశాలను అమలు చేయని పక్షంలో అప్పుడే ధిక్కరణ చర్యలపై ఆలోచిస్తామని వెల్లడించింది.
శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ సుప్రీంకోర్టులో కొనసాగింది. స్పీకర్ పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ న్యాయవాది మోహిత్ రావులు కోరారు. ఇప్పటికే ఈ కేసులో స్పీకర్ కు మూడు సార్లు గడువు పెంచారని, కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించడం లేదని, మరోసారి గడువు పెంచడం సరికాదు అని మోహిత్ రావు వాదించారు. 10మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలలో 8మంది అనర్హత పిటిషన్ల విచారణ మాత్రమే పూర్తి చేశారని, దానం నాగేందర్, కడియం శ్రీహరిల అనర్హత పిటిషన్లపై తగిన సాక్ష్యాధారాలు సమర్పించిన విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకోవడంలో తాత్సర్యం చేస్తున్నారని మోహిత్ రావు వాదనలు వినిపించారు.
అయితే ఇప్పటిదాక అనర్హత పిటిషన్ల విచారణలో స్పీకర్ సాధించిన పురోగతిని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టుకు నివేదించారు. మున్సిపల్ ఎన్నికల్ నేపథ్యంలో మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యే విచారణ పూర్తి చేసేందుకు మరో మూడు వారాల గడువు ఇవ్వాలని కోరారు. స్పీకర్ అభ్యర్థన మేరకు మూడు వారాల పాటు గడువు ఇస్తూ..కేసు విచారణను అప్పటివరకు ధర్మాసనం వాయిదా వేసింది. గడువులోగా విచారణ పూర్తి చేయకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది.
