విధాత: అదంతే మరి.. ఏంజేస్తాం.. జనసేనలోంచి గెలిచిన రాపాక వరప్రసాద్ వైస్సార్సీపీలో చేరడంతో అక్కడ ఓడిన బొంతు రాజేశ్వర రావు ఇంకో మార్గం లేక జనసేనలో చేరారు. వాస్తవానికి గత ఎన్నికల్లో రాజోలు నుంచి వైసీపీ తరపున బొంతు రాజేశ్వరరావు పోటీ చేయగా అక్కడ్నుంచి రాపాక వరప్రసాద్ జనసేన నుంచి గెలిచారు.
గెలవడమైతే గెలిచారు కానీ మొదటి రోజు నుంచి ఆయన వైఎస్సార్సీపీ తోనే అంటకాగుతూ వస్తున్నారు. తన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలూ చేస్తూ వస్తున్నారు. రాపాక అనుచరులు సైతం వైసీపీలో అధికారికంగా చేరారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావుకు సీఎం జగన్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ సలహాదారుడిగా నియమించింది.
అయితే రానున్న ఎన్నికల్లో వరప్రసాద్కే వైసీపీ టికెట్ ఇస్తుందనే సమాచారం ఉండడంతో బొంతు పార్టీ మారడానికి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ చేతుల మీదుగా ఆ పార్టీ కండువాను రాజేశ్వరరావు కప్పుకున్నారు.
రాజోలు జనసేన ఇన్చార్జ్గా బొంతు రాజేశ్వరరావును నియమిస్తున్నట్టు తెలిసింది. ఇదిలా వుండగా అక్కడ టీడీపీ కూడా బలంగా వుంది. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. గత ఎన్నికల్లో రాజోలులో జనసేనకు 33.46%, వైసీపీకి 32.92%, టీడీపీకి 30.47% ఓట్లు వచ్చాయి.
ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరినా, సిట్టింగ్ స్థానం కావడంతో జనసేనకే టికెట్ వస్తుందనే నమ్మకంతో బొంతు ఆ పార్టీలో చేరినట్టు సమాచారం. ఇంకా టిడిపి జనసేన పొత్తుల విషయంలో క్లారిటీ వస్తే ఇంకొందరు లీడర్లు జనసేనలో చేరతారన్న ప్రచారం ఉంది.