విధాత: మునుగోడు ఉపఎన్నికలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. దేశ వ్యాప్తంగా ఖరీదైన ఎన్నికగా అందరి దృష్టిని ఆకర్షించిన ఉప ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా 93.13% పోలింగ్ నమోదు కావడం కొత్త రికార్డుగా నిలిచింది. గతంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో 91.65శాతం పోలింగ్ నమోదుకాగా, మునుగోడు లో 91.07శాతం పోలింగ్ నమోదైంది.
తాజా ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయి లో 93.13శాతం పోలింగ్ నమోదు కాగా మొత్తం ఓటర్లు 2,41,805 మందికి ఉప ఎన్నికల్లో 2,25,192మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలుత మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నానికి ఊపందుకుంది. మునుపెన్నడూ లేని రీతిలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కనబరిచిన మునుగోడు మహిళలు, యువత.. తమ ఓటుహక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారు.
12,1672మంది పురుష ఓటర్లలో 11,3853 మంది, 12,0126 మంది మహిళా ఓటర్లకు 11,1338 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇతరులు ఏడుగురికి ఒకరు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయి.
పోలింగ్ రోజు ప్రధాన పార్టీల నగదు పంపిణీ నేపధ్యంలో తమ వంతు డబ్బు అందే వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల కు వెళ్లక పోవడం, వలస ఓటర్ల రాక ఆలస్యం నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాతే ఓటర్లు అధికంగా పోలింగ్ కేంద్రాలకు రావడం గమనార్హం.
పోలింగ్ సమయం చివర్లో చాలామంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడంతో.. సమయం ముగిసినా వారందరికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఫలితంగా పలు కేంద్రాల్లో రాత్రి 10.30గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం మీద మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి 93.13 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. పెరిగిన పోలింగ్ శాతం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులలో ఎవరికి అనుకూలంగా, ప్రతికూలంగా మారనుందో ఈనెల 6వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో తేలిపోనుంది.
యాక్టివాలోకి దూరిన నాగుపాము.. ఈ వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..
తక్కువ.. ఎక్కువ పోలింగ్ కేంద్రాలు
మునుగోడు ఉప ఎన్నికల్లో మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో అతి తక్కువగాదామెర భీమనపల్లి గ్రామం 240 పోలింగ్ స్టేషన్లో 82.67% పోలింగ్ నమోదయింది. ఇక్కడ 1056 ఓట్లకు గాను 873 ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా తుఫ్రాన్ పేట 68వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో 97.83% పోలింగ్ నమోదయింది. ఇక్కడ 1013 ఓట్లకు గాను 991 ఓట్లు పోలవ్వడం గమనార్హం.
ఐపీఎల్ తరహాలో మునుగోడు ఉప ఎన్నికపై బెట్టింగులు
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ సాగుతున్నాయి. బిజెపి , టిఆర్ఎస్, కాంగ్రెస్ లపై ఎవరు గెలుస్తా రన్న దానిపై 1000కి 2000వేలు, లక్షకు రెండు లక్షలు చొప్పున ఇప్పటికే వంద కోట్లలో బెట్టింగ్ సాగినట్లుగా ప్రచారం సాగుతుంది.
బెట్టింగ్ దారులు యాప్ ల ద్వారా కూడా బెట్టింగ్ నిర్వహించడం చేస్తున్నారు. టిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ లతో పీక్ట్ ఇతర పార్టీలకు కూడ ఎన్ని ఓట్లు వస్తాయి అన్నదానిపై కూడా బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు ఏపీ నుండి కూడా బెట్టింగులు సాగుతున్నట్లు ప్రచారం.