విధాత, బ్యూరో మెదక్ ఉమ్మడి జిల్లా: జనగామ నియోజకవర్గం పరిధిలో గల జిల్లాలోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దుళ్మిట్ట మండలాల్లో మన ఊరు మన బడి పథకంలో కేటాయించిన పాఠశాలలో పని తీరుపైన బుధవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంఎసి చైర్మన్లు, ఎంఈవో, ఎంపీడీవో, ఎపీవో, ఇంజినీరింగ్ విభాగం ఏఈ, డిఈ లు మరియు సర్పంచ్, నిర్మాణ ఏజెన్సీలతో జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్ సమీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మన ఊరు మన బడి పథకం అనేది గొప్ప కార్యక్రమం నిరు పేద పిల్లల కి కార్పొరేట్ స్థాయి సదుపాయాలు కల్పిస్తూ విద్యను అందించడమే ముఖ్యమైన విధి అని ప్రధానోపాధ్యాయులకు తెలిపారు.
ఈ పథకంలో మేజర్, మైనర్ రిపేర్లు, ఎలక్ట్రిసిటీ, తాగునీటి వసతి తప్పనిసరిగా పూర్తి చేశాకే మిగితా పనులు చెయ్యాలి. మరుగుదొడ్ల విషయంలో పాఠశాల ఆవరణలో ఆలోచించి ఓ మూలన మార్కింగ్ ఇచ్చి పనులు పూర్తి చెయ్యాలని ప్రధానోపాధ్యాయులు, డీఈ, ఎఈలకు సూచించారు.
సంపు, కిచెన్ షెడ్, ప్రహరీ, అదనపు తరగతి గదులు ఎన్ఆర్ఈజిఎస్, ఈజీఎస్ చేపట్టిన పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ పూర్తి చెయ్యాలని ఎంపిడిఒ, ఎంపిఓలకి తెలిపారు. ఎఈ లు ఇప్పటివరకు అయిన పనులకు ఎప్టిఓ జేనరెట్ చెయ్యాలి.
ప్రధానోపాధ్యాయులు ఎఈలు, నిర్మాణ ఏజెన్సీలను సమన్వయ పరిచి పనులు పూర్తి చేయించుకోవాలి. అన్ని పనులు పూర్తి చేశాకా కలరింగ్ కు నమోదు చేసుకోవాలి. జిల్లాలో అన్ని మండలాలతో పాటు పోటి పడి పనులు పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పిడి గోపాల్ రావు, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.