విధాత: పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం షర్మిల నిరసన దీక్షకు దిగారు. హైకోర్టు అనుమతి ఉన్నా తన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆమె తప్పు పట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వారి తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా.. పాదయాత్రకు అనుమతివ్వకుండా తన గొంతును అణిచివేస్తుందని ఆరోపించారు.
పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేసి బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతి యుతంగా నిరసన దిగిన ఆడబిడ్డపైన, మహిళా కార్యకర్తల పైన చేయి చేసుకుని బలవంతంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అని ఆరోపించారు.
పాదయాత్రకు హైకోర్టు అనుమతి, తనకు నిరసన వ్యక్తం చేయడానికి హక్కు ఉన్నాయని ఆమె అన్నారు. ప్రభుత్వానికి తన పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణతో భయం పట్టుకుందన్నారు. తన దీక్షను పోలీసులు భగ్నం చేసినప్పటికి పాదయాత్రకు అనుమతి నివ్వని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆమె హెచ్చరించారు.