T20 world cup women’s | దక్షిణాఫ్రికా వేదికగా కేప్టౌన్లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో భారత్ శుభారంభం చేసింది. పాక్పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. జెమీమా రోడ్రిగ్స్ అజేయమైన అర్ధసెంచరీ(53 నాటౌట్)తో భారత జట్టును గెలిపించింది. ఫాతిమా సనా వేసిన 19వ ఓవర్లో జెమీమా రోడ్రిగ్స్ మూడు ఫోర్లు విరుచుకుపడి.. మరో ఓవర్ మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది.
జెమీమా, రీచా ఘోష్ కలిసి నాలుగో వికెట్కు 58 రన్స్ జోడించారు. 93 రన్స్ వద్ద హర్మన్ ప్రీత్కౌర్ ఔట్ అయింది. ఓపెనర్ షఫాలీ వర్మ (33) రెండో వికెట్గా వెనుదిరిగింది. నష్ర సంధు బౌలింగ్లో షఫాలీ మిడాఫ్ దిశగా భారీ షాట్ యత్నించింది. అయితే, అందరూ సిక్స్ అనుకున్నా.. అమీన్ చాలా ఒడుపుగా క్యాచ్ పట్టడంతో పెవిలియన్కు చేరింది.
31 రన్స్ వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. యస్తిక భాటియా (17) ఔట్ అయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 149 రన్స్ చేసింది. పాక్ 68 రన్స్కే నాలుగు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్ అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకుంది. మరో వైపు వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడింది. 55 బంతుల్లో 7 ఫోర్లతో 68 రన్స్ చేసింది.
మరూఫ్, అయేషా నసీం (43)తో కలిసి ఐదో వికెట్కు 81 రన్స్ చేశారు. వీళ్లిద్దరూ మరో వికెట్ పడకుండా ఆడి స్కోర్బోర్డు వంద దాటించారు. ఓపెనర్ జవేరియా ఖాన్ (8), మునీబ ఆలీ (12) పరుగులు చేయగా.. నిడా దార్ డకౌట్ అయ్యింది. భారత బౌలర్లలో రాధ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, పూజా వస్త్రకార్కు తలో ఒక వికెట్ దక్కింది.