R TV | Republic Tv
విధాత: ట్రేడ్ మార్క్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణతో R TV అధినేత రవిప్రకాశ్పై రిపబ్లిక్ టీవీ వంద కోట్లకు దావా వేసింది. ముంబై హైకోర్టులో రిపబ్లిక్ టీవీ ఈ దావా వేసింది. అత్యవసరంగా ఈ పిటిషన్ను వినాలన్న రిపబ్లిక్ టీవీ వాదననను కోర్టు అంగీకరించలేదు. తాము లోగోను మార్చుతూ కేంద్ర ప్రసార సమాచార మంత్రిత్వశాఖకు దరఖాస్తు చేసుకున్నామని ఆర్టీవీ యాజమాన్య కంపెనీ రాయుడు విజన్ మీడియా కోర్టుకు తెలియజేసింది.
R అనే అక్షరంతో తమకు ట్రేడ్మార్కు ఉందని, రాయుడు టీవీ కూడా అదే అక్షరాన్ని ఉపయోగించడం అభ్యంతరకరమని రిపబ్లిక్ టీవీ వాదిస్తున్నది. అయితే రాయుడు టీవీ ఇంకా ఆ లోగోను ఉపయోగించడం మొదలు పెట్టలేదని, అందుకు అనుమతి రాలేదని, అందువల్ల ఈ పిటిషన్పై తక్షణ ఆదేశాలు అవసరం లేదని కోర్టు అభిప్రాయ పడింది.
R TV పేరుతో యూట్యూబ్ చానెల్ ఇప్పటికే నడుస్తున్నదని రిపబ్లిక్ తరపు న్యాయవాది గుర్తు చేశారు. రిపబ్లిక్ టీవీ ప్రారంభించడానికి ముందు నుంచే 2016 నుంచి రాయుడు కుటుంబం పేరిట R TV నడుస్తున్నదని రాయుడు తరఫు న్యాయవాది గుర్తు చేశారు. హైకోర్టు తదుపరి వాయిదాను జూన్ 5కు వాయిదా వేసింది.