విధాత: మనకు తెలియదు కానీ చాలామంది చాలా విషయాలను డబ్బు, బిజినెస్ ఇతరత్రా అంశాల కోణంలోనే ఆలోచిస్తారు. ఇది మంచి ప్లానింగ్ అయినా కొన్నింటికి అది సరిపోదు. ఉదాహరణకు మన కళ్ల ఎదుట ఒక దారుణం కనిపించింది అనుకోండి. దాన్ని కూడా మనం బిజినెస్ కోణంలో ఆలోచించలేం దానికి మనం వెంటనే స్పందించాలి.
మన ఎదురుగా ఎవరైనా ప్రాణాలు కోల్పోతుంటే దాన్ని ఏదో కోణంలో ఆలోచించలేం.. ఆలోచించకూడదు కూడా. మనకు సాధ్యమైనంతలో మనం వారి ప్రాణం రక్షించాలి. అంతెందుకు జనన మరణాలను కూడా మనం బిజినెస్ కోణంలో ఆలోచించలేం. వివాహం కూడా అంతే. నేడు అన్నింటిని, చివరకు జనన, మరణాలు, వివాహం, మగపిల్లాడు, ఆడపిల్ల.. ఇలా ఎవరిని కనాలి అనేవన్నీ బిజినెస్ అయిపోయాయి. దీన్నే కలికాలం ఉంటారు.
డబ్బులు బాగా వచ్చిన తర్వాత, జీవితంలో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుందాం.. పిల్లల్ని కందాం.. మరణ సమయంలో ఎవరి మీదా ఆధారపడకుండా హాస్పిటల్కు అయ్యే ఖర్చు ముందుగా సమకూర్చుకుందాం. డబ్బు, చదువు, ఉద్యోగం ఉన్న అమ్మాయి లేదా అబ్బాయి దొరికే వరకు వివాహం చేసుకోకుండా ఆగుదాం. తొందరేముంది.
అసలు అన్ని కుదిరే వరకు ఎదురు చూద్దాం అనే కాన్సెప్ట్ తప్పు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మెగా కోడలు ఉపాసన కొణిదెల… అదేనండీ ఉపాసన కామినేని తనకు, తన భర్త రామ్ చరణ్కు పుట్టబోయే బిడ్డల విషయంలో కూడా చాలా ప్లానింగ్తో ఆలోచించింది.
తాజాగా ఉపాసన, రాంచరణ్ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోన్న సంగతి తెలిసిందే. దీంతో మెగా అభిమానులు.. నాయనమ్మ, తాతయ్యలు కాబోతున్న చిరంజీవి సురేఖల ఆనందానికి అవధులు లేవు. ఈ ఆనందాన్ని ఎన్ని కోట్లు పెట్టినా కొనలేము. వీటిని డబ్బుతో వెలగట్టలేము. సరే చిరంజీవి సురేఖ సంగతి పక్కన పెడితే మెగా అభిమానులు ఎంతగానో సంబరాలు చేసుకుంటున్నారు. వారి ఆనందాన్ని ఉపాసన డబ్బులతో లెక్క కట్టగలరా? అనేది ఆమె ఆలోచించుకోవాలి.
ఉపాసన రాంచరణ్ వివాహం జరిగిన 10 ఏళ్ల తర్వాత వారు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇంత ఆలస్యం కావడానికి గల కారణాన్ని గతంలో ఉపాసన ఒకసారి ఇలా చెప్పుకొచ్చింది. పిల్లలను కనడం అనేది 20 సంవత్సరాల బిగ్ ప్రాజెక్టు. మనం తల్లిదండ్రులు కావడానికి మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలి.
ఈ ప్రపంచంలోకి ఒక ప్రాణిని తీసుకురావడం అనేది అతి పెద్ద బాధ్యత. వారు పుట్టిన తర్వాత వారికి ఏమి చేయాలి.. వారికి ఏమి కావాలి అనే విషయాల గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఇలా అన్ని విషయాల గురించి మనకు అవగాహన ఉన్నప్పుడే తల్లిదండ్రులు కావాలని ఓ సందేశం పడేసింది. ఇలా పిల్లలకు ఏం కావాలనే విషయాల గురించి పూర్తిగా సిద్ధమయ్యే అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఫ్యామిలీని ప్లానింగ్ చేసుకోవాలని ఆమె తెలిపింది.
అంటే తల్లిదండ్రులు కావడానికి కూడా ఉపాసన ఒక బిజినెస్ ఉమెన్గా ఎంతో ప్రాక్టికల్గా ఆలోచించిందని చెప్పాలి. గతంలో ఉపాసన చేసిన ఈ కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మేము మా గుర్రాలను, కుక్కలను చాలా బాగా చూసుకుంటాం. అలాంటిది పిల్లల విషయంలో ఇంకా ఎంత జాగ్రత్తగా ఉంటామో ఊహించొచ్చు.
బిడ్డను పెంచడానికి మేము ఎలాంటి కృషి, ఆలోచన విధానాన్ని అనుసరిస్తామనేది మీరే ఆలోచించండి. ఇది మాకు నిజంగా ముఖ్యమైనది. పిల్లల విషయంలో మేము ఖచ్చితమైన ఓ ప్రణాళికను కలిగి ఉన్నామంటూ జీవిత నిజాన్ని తెలిపింది. అయితే ఒక బిడ్డ చాలు అనుకునే వారికి కవల పిల్లలు, ఒకేసారి ముగ్గురు నలుగురు పుట్టిన సంఘటనలు ఉన్నాయనే విషయం స్వయంగా అపోలో హాస్పిటల్స్ కలిగిన ఉపాసనకు తెలియకుండా ఉండదనే భావించాలి.