రవిశంకర్‌ ప్రసాద్‌కు పోటీగా జగ్జీవన్‌రామ్‌ మనుమడు

బీహార్‌లోని 40 స్థానాలకు గాను ఎన్డీఏ గత ఎన్నికల్లో 39 చోట్ల గెలుపొందింది. కానీ ఈసారి అక్కడ ఆ పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి

  • Publish Date - April 23, 2024 / 07:52 PM IST

బీహార్‌లోని 40 స్థానాలకు గాను ఎన్డీఏ గత ఎన్నికల్లో 39 చోట్ల గెలుపొందింది. కానీ ఈసారి అక్కడ ఆ పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి. మొదటి దఫాలో అక్కడ జరిగిన నాలుగు స్థానాల్లో కషాయపార్టీకి కష్టాలు తప్పవనేది అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ బీహార్‌లోని పట్నా సాహిబ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి తమ అభ్యర్థిని ఖరారు చేసింది. స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్‌ మనుమడు, మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ కుమారుడు డాక్టర్‌ అన్షుల్‌ అవిజీత్‌ను నిలబెట్టింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.
ప్రస్తుతం పట్నా సాహిబ్‌ నియోజకవర్గానికి కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీజేపీ మరోసారి ఆయనకే టికెట్‌ ఇచ్చింది. ఆయనపై పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ అన్షుల్‌ను బరిలోకి దింపింది. ఈ స్థానంలో బీజేపీకి గట్టి పట్టున్నది. 2009, 2014లో బీజేపీ తరఫున బాలీవుడ్‌ ప్రముఖ నటుడు శతృఘ్నసిన్హా రెండుసార్లు వరుసగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో సిన్హా కాంగ్రెస్‌ చేరి ఇదే స్థానంలో పోటీ చేయగా ఆయనపై రవిశంకర్‌ ప్రసాద్‌ గెలుపొందారు, ఈసారి ఆయనపై పోటీ చేస్తున్న అన్షుల్‌ కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు.

Latest News