బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. అత్తతో జరిగిన చిన్న గొడవ… ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి దారి తీసింది. ఈ ఘటన బెంగళూరులోని అబ్బిగేరెలో చోటు చేసుకుందని పోలీసులు మంగళవారం తెలిపారు.
సుష్మ.. స్థానిక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నది. ఆమె.. ఐదేళ్ల క్రితం పునీత్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వారికి నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. సుష్మకు ఆమె అత్త కల్పనతో నిత్యం ఇంటికి సంబంధించిన విషయాల్లో గొడవలు జరుగుతూ ఉండేవని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నా.. ఎవరి వంటిల్లువారిదేనని తెలిపారు.
నిత్యం గొడవలు జరుగుతున్నా.. కొన్ని వారాలుగా అవి తీవ్ర స్థాయికి వెళ్లాయని ఈ కుటుంబంతో సంబంధాలు ఉన్నవారు తెలిపారు. సోమవారం ఉదయం సుష్మ ఎక్కువ సేపు వంటగదిలో ఉన్న విషయంలో ఆమె అత్త కల్పన వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి మరింత దిగజారింది. పదిన్నర సమయంలో సుష్మ బలవన్మరణానికి ప్రయత్నించినట్టు తెలుస్తున్నది. ఆ సమయంలో భర్త, అత్త ఇద్దరూ అదే ఇంట్లో ఉన్నారు. నిస్తేజంగా పడి ఉన్న సుష్మను వెంటనే హాస్పిటల్కు తరలించగా.. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు.
కుటుంబ వివాదాల నేపథ్యంలోనే సుష్మ బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. అయితే.. అన్ని కోణాల్లో ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. భర్త, అత్తమామలు వరకట్నం కోసం వేధిస్తున్నారని సుష్మ తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు పునీత్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోలదేవనహళ్లి పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. వేధింపుల ఆరోపణలతో సహా ఆమె మరణానికి దారి తీసిన పరిస్థితుల గురించి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
