విధాత: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. ప్రభాకర్ రావు తరఫున లాయర్ సి.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారని..ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే వెంటనే హైదరాబాద్ తిరిగొస్తారని ఆయన న్యాయవాది తెలిపారు. ప్రభాకర్ రావు 30ఏళ్లకు పైగా ప్రభుత్వ సర్వీసులో వివిధ హోదాల్లో పనిచేసి అనేక ఉత్తమ గుర్తింపులు పొందాడని వివరించారు. ప్రభాకర్ రావు 65ఏళ్ల వయసులో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో నిందితుడు శ్రవణ్ రావుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని నిరంజన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ప్రభాకర్ రావుకు సైతం ముందస్తు బెయిల్ మంజూరుచేస్తే దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాజకీయ కక్ష్య సాధింపుల కోసమే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారని ప్రభాకర్ రావు న్యాయవాది తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలను ధ్వంసం చేశారన్నది అవాస్తవమని ప్రభాకర్ రావు న్యాయవాది వెల్లడించారు.
ఆధారాలున్నాయి..బెయిల్ వద్దు
పోలీసుల తరపున సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపించారు. 65ఏళ్ల వయసుందన్న సాకుతో ప్రభాకర్ రావు దర్యాప్తు నుంచి తప్పించుకోలేరన్నారు లూద్రా వాదించారు. నిందితుడు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పూర్తి ఆధారాలున్నాయని… హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసి నీళ్లలో పడేస్తే వాటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారని లూద్రా కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని లూద్రా కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఇరువైపుల వాదనల అనంతరం హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.