V Kaveri Travels | హైదరాబాద్ : హైదరాబాద్( Hyderabad ) నుంచి బెంగళూరు( Bengaluru ) బయల్దేరిన వి కావేరి ట్రావెల్స్ బస్సు( V Kaveri Travels Bus )నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు, పోలీసుల విచారణలో తేలింది. ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్నెస్ గడువు ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసింది. ఇన్సూరెన్స్ పాలసీ గతేడాది ఏప్రిల్ 20వ తేదీన, ట్యాక్స్ గడువు గతేడాది మార్చి 31న ముగిసింది. 2024 ఏప్రిల్ 2న పొల్యూషన్ వ్యాలిడిటీ ముగిసింది. ఇక ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనల కింద రూ.23,120 పెండింగ్ చలాన్లు నమోదు అయ్యాయి.
ఇక ఈ బస్సు ప్రమాదానికి గురైన సమయంలో మిర్యాల లక్ష్మయ్య, గుడిపాటి శివనారాయణ డ్రైవర్లుగా ఉన్నారు. లక్ష్మయ్య డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ వచ్చే ఏడాది జనవరి 21వ తేదీతో ముగియనుంది. శివ నారాయణ డ్రైవింగ్ లైసెన్స్ కూడా వచ్చే ఏడాది జనవరి 15వ తేదీన ముగియనుంది.
బస్సు ప్రమాద ఘటనను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గురువారం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున 3.30 గంటలకు కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో బైక్ ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం భారీగా జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ఉన్నారు. 30 మంది ప్రయాణికుల వరకు సజీవ దహనమైనట్లు తెలిసింది. ప్రమాదం తర్వాత ఘటనా స్థలం నుంచి బస్సు డ్రైవర్, సిబ్బంది పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పరారైన డ్రైవర్, సహాయక డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నాం అని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు.
