Engineering Student | నేటి తరం యువత ఫ్రెండ్స్ను ఎక్కువగా నమ్ముతుంటుంది. వారి కోసం ఏకంగా ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్ధమవుతుంటారు కొందరు. కొద్ది రోజుల పరిచయంతోనే వారితో అన్ని విషయాలను షేర్ చేసుకుంటుంటారు. స్నేహితులను నమ్మినంతగా ఇంట్లో వాళ్లని కూడా నమ్మరు. ఫ్రెండ్ కష్టంలో ఉన్నాడని తెలిస్తే చాలు ఎంతదూరమైనా వెళ్తారు. ఈ క్రమంలోనే తన స్నేహితుడికి సాయం చేసి ఓ విద్యార్థి (Engineering Student) ఏకంగా రూ.7 కోట్ల సైబర్ ఉచ్చులో (Fraud) చిక్కుకుని కటకటాల పాలయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడు.
బెంగళూరు (Bengaluru)లోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థికి ఏడాది క్రితం ఆయుష్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ క్రమంలో గతేడాది నవంబర్లో విద్యార్థికి తన ఫ్రెండ్ ఫోన్ చేశాడు. తన బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయ్యిందని, అత్యవసరమైన లావాదేవీల కోసం అకౌంట్ కావాలని కోరాడు. స్నేహితుడే కదా అని ఆ విద్యార్థి తన బ్యాంకు డీటెయిల్స్ (Bank Details) అన్నీ ఇచ్చేశాడు.
కర్ణాటక గ్రామీణ బ్యాంక్ (Karnataka Gramin Bank) పాస్బుక్, ఏటీఎం కార్డ్, నెట్బ్యాంకింగ్ వివరాలు, ఖాతాకు లింక్ చేసి ఉన్న ఎయిర్టెల్ సిమ్ కార్డ్ వివరాలను విద్యార్థి తన స్నేహితుడికి పంపించాడు. అయితే, కొన్ని నెలలకు బ్యాంకు నుంచి విద్యార్థికి ఓ ఫోన్కాల్ వచ్చింది. తన ఖాతా నుంచి అక్రమ లావాదేవీలు జరిగినట్లు అధికారులు తెలిపారు. అతడి అకౌంట్ ద్వారా ఏకంగా రూ.7 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు చెప్పారు. ఆ మాటలు విని విద్యార్థి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
బాధితుడు వెంటనే బెంగళూరు నార్త్ డివిజన్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఫిర్యాదు చేశారు. విద్యార్థి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆయుష్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. విద్యార్థి బ్యాంకు ఖాతా వివరాలను అతడు విదేశాల్లోని సైబర్ నేరగాళ్లకు విక్రయించినట్లు చెప్పాడు. దీంతో అధికారులు సదరు ఖాతాను బ్లాక్ చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్రెండ్స్ని గుడ్డిగా నమ్మి ఇలా వివరాలు షేర్ చేయొద్దని పోలీసులు సూచించారు.
ఇవి కూడా చదవండి :
Peacock Tail Fish : సముద్రంలోని ద్వారకలో నెమలి పింఛంతో చేపలు.. వైరల్ వీడియో
Heartwarming Friendship : దోస్త్ తోడుగా ఎంఆర్ఐ స్కాన్ మిషన్ లోకి..వైరల్ ఘటన !
