విధాత, వరంగల్: మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన సంఘటన వరంగల్ నగరంలో జరిగింది. ఇద్దరు వ్యక్తులు దయానంద్ కాలనికి చెందిన మైనర్ బాలిక పై లైంగిక దాడి చేసినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ఈ దారుణం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ అఘాయిత్యంపై మిల్స్ కాలనీ పోలీసులకు బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. లైంగిక దాడికి పాల్పడిన నిందితులను శిక్షించి న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
మైనర్ బాలికపై లైంగిక దాడి చేసింది పర మతానికి సంబంధించిన వ్యక్తులు కావడంతో ఈ దారుణాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. తమ పార్టీ కార్యకర్తలతో కలిసి సదరు బాధితురాలు కుటుంబం నివసిస్తున్న దయానంద్ కాలనీలో గురువారం ఆందోళనకు దిగి ధర్నా చేశారు.
లైంగిక దాడికి పాల్పడిన నిందితులను, వెనుక ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ధర్నాలో పాల్గొన్న బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇటీవల వరంగల్ లో జరిగిన లైంగిక దాడులను ఈ సందర్భంగా బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తావించారు. రోజురోజుకీ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. రోజూ ఎక్కడో ఒకచోట మైనర్ బాలికలపై లైంగిక దాడి జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. నిరసనలో బీజేపీ తూర్పు నాయకుడు కుసుమ సతీష్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.