విధాత, హైదరాబాద్: ఆరు గ్యారెంటీల అమలకు నిధులు లేకుంటే.. బిఆరెస్ మేనిఫెస్టో అమలుకు నిధులు ఉన్నాయా? అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కేసీఆర్ను ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు చెప్పినట్టుగా మోసం మాటలు కాంగ్రెస్ పార్టీ చెప్పదని, చెప్పిందే చేస్తది, చేసేదే చెప్తుందన్నారు. సోమవారం నియోజకవర్గంలోని మోటమర్రి, రాయణపేట, అల్లపాడు, గోవిందాపురం, కలకోట, బ్రాహ్మణపల్లి, రాపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ బిఆరెస్ పాలకులు ప్రజలకు చెందాల్సిన సంపదను దోపిడీ చేసినందున ఆసంపద ప్రజలకు అందలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు ఎక్కడివని అనడానికి కేసీఆర్, కేటీఆర్ లకు బుద్ధుండాలన్నారు. మాయమాటలతో ఎవరిని మోసం చేస్తారు? ఇంకెంతకాలం ప్రజలను మభ్యపెడతారన్నారు.
ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాలు, దళితున్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి బిఆరెస్ మోసం చేసినట్లుగా కాంగ్రెస్ మోసం చేయదని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందన్నారు. ప్రజలను మోసం చేయడం బిఆరెస్ కు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి పాలకుల దోపిడి అరికడితే చాలని, పరిపాలన అనుభవం కలిగిన మాకు ఆరు గ్యారంటీ అమలకు నీళ్ళు ఎక్కడి నుంచి తేవాలో తెలుసని చెప్పారు.
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని 10 ఏండ్లుగా ఇందిరమ్మ ఇల్లు కూడా సీఎం కేసీఆర్ ఇవ్వలేదన్నారు.
దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్యన జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు గెలవాలన్నారు. ప్రజల సంపద తిరిగి ప్రజలకు పంచబడాలన్నారు. ప్రజల సంపద ప్రజలకు చెందాలని భావించే ప్రతి ఒక్కరు తెలంగాణలో ప్రజల ప్రభుత్వం రావడానికి చేయ్యి గుర్తుపై ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఆరు గ్యారంటీలు కావాలనుకునే ప్రజలు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.