విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడం పట్ల జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ ఏజెన్సీ నిర్వాహకులు, ఆర్ అండ్ బి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నూతన కలెక్టరేట్ నిర్మాణ పనుల ప్రగతిని ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు, డి.ఎఫ్.ఓ. తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో కలెక్టరేట్ నిర్మాణాలు పూర్తయి ప్రారంభమవుతున్నాయి. కానీ మన దగ్గర ఎక్కడా లేని విధంగా మన జిల్లాలో నిర్మాణ పనులు నత్తనడకన ఇంకా కొనసాగుతుండడం పట్ల తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ అంతా కలియ తిరిగి ఇంకా అక్కడక్కడ అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని, వాటర్ సంప్ కు వెంటనే నీటి కనెక్షన్ ఇవ్వవలసినదిగా మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు.
అంతర్గత సిసి రోడ్లు నాణ్యతతో వేయాలని, ప్రహరీగోడ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కలెక్టరేట్ ఆవరణం ఆహ్లాద వాతావరణం కనిపించేలా పచ్చదనం, చక్కటి నీడనిచ్చే మొక్కలు ఇప్పటి నుంచే నాటవలసినదిగా జిల్లా అటవీ అధికారికి సూచించారు.
కలెక్టర్ వెంట ఆర్ అండ్ బి ఈఈ శ్యామ్ సుందర్, డిప్యూటీ ఈఈ వెంకటేశం, ఏఈ రియాజ్, జిల్లా అధికారులు, ఏజెన్సీ ప్రాజెక్ట్ మేనేజర్ రాజేష్ తదితరులు ఉన్నారు.