విధాత, హైదరాబాద్ : బంగ్లాదేశ్లో తలెత్తిన పరిణామాలు ప్రధాని నరేంద్ర మోదీకి గుణపాఠం కావాలని సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధంగా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలతో బంగ్లాదేశకు పట్టిన గతిని చూసి ప్రధాని మోదీ తన పరిపాలనా విధానాలు మార్చుకోవాలని హితవు పలికారు. ముస్లిం మైనార్టీలు, వారికి సంబంధించిన హక్కులను కాలరాసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వక్ఫ్బోర్డు సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని, బిల్లుపై తమకు కూడా అభ్యంతరాలు ఉన్నాయన్నారు.
ఏపీకి కేంద్రం బడ్జెట్లో గ్రాంటులివ్వలేదని, అప్పు మాత్రమే ఇచ్చిందన్న సంగతి అంతా గుర్తెరుగాలన్నారు. ప్రత్యేకంగా ఏపీకి నిధులు కుమ్మరించినట్లుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రచారం చేసుకోవడం విడ్డూరమన్నారు. మాజీ సీఎం జగన్ ఢిల్లీలో చేపట్టిన ధర్నా అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారని, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన రెండు నెలలకే రాష్ట్రపతి పాలన కోరడం విడ్డూరంగా ఉందని జగన్పై మండిపడ్డారు.