విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ అభివృద్ధి అంటే మాధాపూర్, హైటెక్ సిటీ మాత్రమే కాదని, పాత బస్తీని కూడా అభివృద్ధి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజవర్గం పరిధిలోని బౌద్ధ నగర్ డివిజన్, పార్సిగుట్టలో తన ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించిన రెండంతస్థుల కమ్యూనిటీ హాల్ ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో కలిసి కట్టుగా మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బస్తీల్లో రోడ్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, వంటి అనేక మౌలిక వసతులను కల్పించాలని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో రెవెన్యూ వస్తున్నప్పటికీ.. కేటాయింపుల్లో పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ చూపి హైదరాబాద్ నగర అభివృద్ధికి నిధుల కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆగస్టు 15 తర్వాత హైదరాబాద్ మహానగర అభివృద్ధి కార్యక్రమాలపై దిశా మానిటరింగ్ కమిటీ హైలెవల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎడ్యుకేషన్, మైనారిటీ వ్యవహారాలు, రైల్వేలు వంటి అంశాలపై చర్చించి, నత్తనడకన నడుస్తున్న పనులు వేగవంతం చేసేలా దిశ నిర్దేశం చేస్తామని కేంద్రమంత్రి వెల్లడించారు