– డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యం
– హుజూర్ నగర్ అభ్యర్థి శ్రీలత రెడ్డిని గెలిపించాలి
– ప్రచార సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ కంకణం కట్టుకున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆరోపించారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. హుజూర్నగర్ లో బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. శనివారం హుజూర్ నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద బీజేపీ అభ్యర్థి చల్ల శ్రీలత విజయాన్ని ఆకాంక్షిస్తూ బీజేపీ ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభకు నడ్డా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకి ఎన్నో నిధులు కేటాయించిందని, కానీ ఇక్కడ రాష్ట ప్రభుత్వం వాటిని సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్నివర్గాలకు మాత్రమే బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుందని, నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ను 16% పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నదని తెలిపారు.
తెలంగాణ పాలన చూస్తే ఎంతో బాధగా ఉందని, ఇక్కడి ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని అన్నారు. ఒక మతానికి చెందిన వారికి ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచారి రాక్షసుల సమితి అని అభివర్ణించారు. అసైస్ట్ భూములను ధరణి పోర్టల్ లో తీసుకురాకుండా వేలాదిమంది రైతులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్ కేసీఆర్ కుటుంబానికి, పెద్దలకు డబ్బులు దాచుకునేందుకు ఒక మిషన్ లాగా ఉపయోగపడుతోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విలువ రూ.35 వేల కోట్లు అయితే, రూ.38 కోట్లకి పెంచి ఒక ఏటీఎం మిషన్ లాగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. దళిత బంధు స్కీములో 30% ఎమ్మెల్యేలే కమీషన్ తీసుకున్నారని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రం అవినీతిమయంగా మారిందన్నారు. ఫసల్ బీమా పథకం రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో రెండున్నర లక్షల మంది నష్టపోయారని అవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తే, దాన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
మహిళలు ఆత్మగౌరవంగా జీవించాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉపాధి కల్పించాలన్నా, రైతులకు మేలు చేయాలన్నా అది బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ 45 సంవత్సరాలు అధికారంలో ఉండి వేలాదిమంది యువకులను బలి తీసుకోవడానికి కారణమైందని దుయ్యబట్టారు. 1969లో 369 మంది యువకులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని అన్నారు. అలాగే మలిదశ ఉద్యమంలో 2004లో 1500 మంది యువకుల బలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీనే అన్నారు. సోనియా గాంధీ 2004లో తెలంగాణ ఇస్తానని వాగ్దానం చేసిందన్నారు. డిసెంబర్ 2009 డిసెంబర్లో తెలంగాణ ఇచ్చి వాపసు తీసుకోవడంతో విద్యార్థులు కదిలివచ్చి దుర్మరణం చెందారని, 2014 వరకు అదే విధంగా సతాయించిందన్నారు. మోడీ ప్రభుత్వంలో దేశంలో ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ఆరో స్థానంలో ఉందన్నారు. వ్యవసాయ రంగానికి గత 10 ఏళ్లలో ఆరు రేట్లు బడ్జెట్ పెంచిందని గుర్తు చేశారు. రైతులు ఫర్టిలైజర్ కు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రామగుండంలో ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ పునర్నించినట్లు తెలిపారు.
మహిళా స్వయం సహాయక బృందాలకు ఒక శాతం వడ్డీతోనే రుణాలను అందిస్తామని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ద్వారా ఆరు నెలలకు ఒకసారి నోటిఫికేషన్ లేసి ఉద్యోగాలు కల్పిస్తామని, సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు అవినీతి పార్టీలని, వాటిని పారదోలాలని, హుజూర్ నగర్లో శ్రీలత, కోదాడలో సతీష్ రెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ప్రజలను కోరారు.