– నల్గొండ ప్రజల కోసం ఏదైనా త్యాగం చేస్తా
– సీఎం కేసీఆర్ దత్తత పేరుతో దగా చేసిండు
– కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడో ఒకసారి కచ్చితంగా సీఎం అవుతానని కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పారు. మంగళవారం నల్గొండలో వేల మంది కార్యకర్తలతో భారీ ర్యాలీగా తరలివెళ్లిన ఆయన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సమర్పించారు. అనంతరం పెద్ద గడియారం చౌరస్తాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కోమటిరెడ్డి మాట్లాడారు. నల్గొండ ప్రజలు మరోసారి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. రాజకీయ జన్మనిచ్చిన నల్లగొండ నియోజకవర్గాన్ని నా ప్రాణం ఉన్నంతవరకు మర్చిపోనని అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి నాకు రాజకీయంగా ఉన్నత స్థానం కల్పించారని చెప్పారు. నల్గొండ ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు. గత ఎన్నికల్లో దత్తత పేరుతో సీఎం కేసీఆర్ నియోజకవర్గ ప్రజలను వంచనకు గురిచేశాడని విమర్శించారు. బీఆరెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేయలేదని ధ్వజమెత్తారు. మహబూబ్ నగర్ నుంచి రామకృష్ణారావు, రంగారెడ్డి నుంచి చెన్నారెడ్డి, ఖమ్మం నుంచి జలగం వెంగళరావు సీఎంలు అయ్యారని చెప్పుకొచ్చిన కోమటిరెడ్డి… తాను కూడా ఎప్పుడో ఒకసారి నల్లగొండ నుంచి సీఎం అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చిందన్నారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని ఆవేదన చెందారు. రైతులు ఆత్మహత్య చేసుకున్నా రుణమాఫీ చేయకపోవడం దుర్మార్గమన్నారు. రైతులు, విద్యార్థులకు బతికున్నప్పుడు అందని సహాయం.. చనిపోయినప్పుడు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ కు రోజులు దగ్గర పడ్డాయని, రాబోవు రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేయాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజల్ని కోరారు. కేసీఆర్ నిజాం నవాబులా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు ప్రజలందరికీ అందించడంతోపాటు రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఉమ్మడి జిల్లాలో మంత్రి జగదీశ్ రెడ్డి సంస్కారం లేని వ్యక్తి అని విమర్శించారు. 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం కమీషన్ల కోసం కక్కుర్తి పడి కట్టిన ప్రాజెక్టులు కూలిపోవడం దుర్మార్గమైన చర్యగా చెప్పారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నల్లగొండ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మనిమద్ది సుమన్, తిప్పర్తి జడ్పీటీసీ పాశం రామ్ రెడ్డి, నల్గొండ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోపగాని మాధవి, కనగల్ మండల పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుప రెడ్డి, మాజీ జడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూకూరి రమేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.