రుణమాఫీపై సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ సవాల్
ప్రభుత్వంపై పోరాటంలో ఇది ఆరంభమే
ప్రజాపాలనలో ప్రశ్నిస్తే పాపమా అని ఫైర్
విధాత : సీఎం రేవంత్రెడ్డి చెప్పినట్లుగా సంపూర్ణ రుణమాఫీ జరిగితే సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లో రావాలని, రుణమాఫీ జరిగిందో లేదో గ్రామాల్లోకి వెళ్లి అడుగుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్రెడ్డికి సవాల్ విసిరారు. చేవెళ్లలో రైతు రుణమాఫీ సమస్యలపై నిర్వహించిన బీఆరెస్ నిరసనలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పాల్గొన్న కేటీఆర్ రైతులను, కార్యకర్తలనుద్ధేశించి మాట్లాడారు. ‘రైతు రుణమాఫీ చెయ్యకపోతే నీ లాగుల్లో తొండలు వదిలి రుణమాఫీ అయ్యేదాకా వదిలిపెట్టం’ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో రైతు రుణమాఫి జరిగిందని రైతులు చెబితే తాను వెంటనే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. బీఆరెస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదని.. భారత రైతు సమితి కూడా అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆరెస్ చేపట్టిన ప్రజాందోళనల్లో ఇది ఆరంభం మాత్రమేనని.. అంతం కాదని ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరించారు. రుణమాఫీ రైతులందరికి అమలయ్యేదాకా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటాడుతామన్నారు. రుణమాఫీ పై ప్రశ్నిస్తేనే బెదిరిపోతున్నారు, భయపడుతున్నారని.. ఇంకా మీ ఆరు గ్యారంటీలు…420 హామీల గురించి అడిగితే ఏమైపోతారో అని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ అని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలని, సీఎం డౌన్ డౌన్ అంటూ కేటీఆర్ నినదించారు. మూడు రోజుల క్రితం నర్కోడా గ్రామానికి వెళ్లానని.. గ్రామాల్లో ఇప్పుడు కళ తప్పిందని అక్కడి ప్రజలు అన్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. డిసెంబర్ 9 నాడు అధికారంలోకి రాగానే రైతు రుణమాఫి చేస్తానని సోనియా గాంధీ మీదా ఒట్టు వేసి చెప్పాడని రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రైతుల రుణమాఫి కావాలంటే రూ. 49 వేల కోట్లు ఖర్చు అవుతుందని బ్యాంకు అధికారులు చెప్పారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో దేవుల్ల మీద ఒట్టు పెట్టారని.. రైతు రుణమాఫి చేస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. ‘దేవెళ్ళు కూడా అడుగుతున్నారు.. రేవంత్ రెడ్డి ఎక్కడకి పోయాడని.. మమ్మల్ని మోసం చేశాడని.’ అని తనదైన శైలిలో సీఎంపై విరుచుకుపడ్డారు కేటీఆర్. డబ్బులు లేక రైతు రుణమాఫీ విషయంలో కొర్రీలు పెట్టారని దుయ్యబట్టారు. రూ. 31 వేల కోట్లు అవసరమని కేబినెట్లో పెట్టారని.. బడ్జెట్లో చూస్తే రూ. 26 వేల కోట్లే పెట్టారని విమర్శించారు. ఇదే అంశంపై అసెంబ్లీలో తాము ప్రశ్నిస్తే తమ మైక్లు కట్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. రుణమాఫీలో కటింగ్ పెడితే.. రేపు రైతు భరోసాలో కూడా కటింగ్ లు పెడుతాడని, మీరు ఇప్పుడు దీనిని వదిలేస్తే… తర్వాత కూడా ఇదే విధంగా కోతలు పెట్టుకుంటు పోతాడన్నారు.
చావు డబ్బులు కొడుతున్న రైతులు
రైతు రుణమాఫీ కాలేదని రైతులందరూ ఇవాళ రేవంత్ రెడ్డి చావు డబ్బు కొడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదన్నారు. కొండారెడ్డిపల్లి రైతుల దగ్గరకు పోదామని తాను సవాల్ చేస్తే.. తన సవాల్ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించలేదని ఎద్దేవా చేశారు. కొండారెడ్డిపల్లిలో రైతు రుణమాఫి జరిగిందని రైతులు చెబితే తాను వెంటనే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. రూ. 7,500 కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ జరిగిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బ్యాంకర్లతో అంటున్నారని.. ఎటువంటి ఆంక్షలు లేకుండా రూ. 2 లక్షల రైతు రుణమాఫి చేయాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. కొండారెడ్డిపల్లిలో రైతురుణమాఫీ సమస్యలపై వెళ్లిన మహిళా జర్నలిస్టులపై దాడులు చేశారని, | ప్రజాపాలనలో ప్రశ్నించటమే పాపమా కేటీఆర్ నిలదీశారు. రైతులు, విద్యార్థులు, జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు ఎవరు ప్రశ్నించినా.. అయితే పోలీసులు లేదంటే మీ గుండాలను ప్రయోగిస్తారా అని ప్రశ్నించారు. హామీలు అమలు చేయాలంటే బెదిరింపులు, బ్లాక్ మెయిళ్లు, దాడులు, కేసులు పెట్టడమేంటని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఆనాటి ఎమర్జెన్సీని అప్రకటితంగా అమలు చేయటమేనా అని ప్రశ్నించారు. రుణమాఫీ పూర్తిగా చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అసెంబ్లీలో సబితక్క పాపం ఒక్క మాట అనలేదని, ఇంట్లో దోమలు కుడుతున్నాయి.. ఇంటి బయలకు పోతే కుక్కలు కరుస్తున్నాయి అని అసెంబ్లీలో సబితక్క మాట్లాడిందని, అక్కలను నమ్ముకుంటే నీ బ్రతుకు జూబ్లీ బస్టాండ్ అవుతుందని సబితమ్మను టార్గెట్ చేశారని నిండు శాసనసభలో సబితక్కను అవమానించారు.’ అని సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కేటీఆర్ మరోసారి విమర్శలు చేశారు.