KTR | విదేశీ కంపెనీలతో మా సంబంధాలే ఇప్పుడు రాష్ట్రానికి మేలు చేస్తున్నాయని కేటీఆర్ ట్వీట్‌

పదేళ్ల పాటు అధికారంలో ఉన్న తాము ఇతర దేశాల్లో ఉన్న ప్రముఖ కంపెనీ ప్రతినిధులతో పెంచుకున్న సంబంధాలే నేడు రాష్ట్రానికి మేలు చేకూరుస్తున్నాయని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా పేర్కోన్నారు

  • Publish Date - August 4, 2024 / 01:47 PM IST

సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన సందర్భంగా కేటీఆర్ ట్వీట్‌

విధాత, హైదరాబాద్ : పదేళ్ల పాటు అధికారంలో ఉన్న తాము ఇతర దేశాల్లో ఉన్న ప్రముఖ కంపెనీ ప్రతినిధులతో పెంచుకున్న సంబంధాలే నేడు రాష్ట్రానికి మేలు చేకూరుస్తున్నాయని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా పేర్కోన్నారు. విరామం లేకుండా పట్టుదలతో రాష్ట్రానికి భారీ ఎత్తున వీదేశీ పెట్టుబడులు తీసుకొచ్చామని, వాటిని చూసి ఇవాళ మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి రానుండటం సంతోషకరమని అన్నారు. రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృదం అమెరికా, దక్షిణ కోరియా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఆర్థికాభివృద్ధికి అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించేందుకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు.

టీఎస్ ఐపాస్‌తో ప్రభుత్వ వినూత్నమైన విధానాలకు ఆకర్షితులై చాలా సంస్థలు రాష్ట్రంలో గణనీయంగా పెట్టుబడి పెట్టాయని చెప్పుకొచ్చారు. గత దశాబ్ద కాలంలో రూ.4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు వివిధ రంగాల్లో 24 లక్షలకు పైగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను సృష్టించామని పేర్కోన్నారు. రాజకీయాలు పక్కన పెడితే.. తనకు, బీఆరెస్‌ పార్టీకి ఎల్లప్పుడూ ‘తెలంగాణ ఫస్ట్ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రత్యక్ష పెట్టుబడులను తీసుకురావడంలో విజయం సాధించాలని, తాము స్థాపించిన బలమైన పునాదిపై తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తారని హృదయపూర్వకంగా ఆశిస్తున్నానని… జై తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు.