Ponnam Prabhakar VS Adluri Laxman | పొన్నం వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం

మంత్రి పొన్నం ప్రభాకర్ తనను కించపరిచేలా మాట్లాడారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాలని, లేదంటే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

Ponnam Prabhakar VS Adluri Laxman

విధాత : మంత్రి పొన్నం ప్రభాకర్ నన్ను కించపరుస్తూ చేస్తున్న వ్యాఖ్యల పట్ల వెంటనే క్షమాపణలు చెప్పాలని..లేదంటే తర్వాత జరిగే పరిణామాలకు నేను బాధ్యుడిని కాదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హెచ్చరించారు. ఇప్పటికే పొన్నం వ్యాఖ్యలపై ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు లేఖ రాసినట్లు వెల్లడించారు. త్వరలోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ కు లేఖ రాస్తానని ఆడ్లూరి తెలిపారు. పొన్నం సహచర దళిత మంత్రిని కించపరిచే వ్యాఖ్యలు చేస్తుంటే.. పక్కన ఉన్న మరో దళిత మంత్రి వివేక్ ఖండించ లేదని ఆడ్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాపై వ్యక్తిగతంగానే కాకుండా..మా సామాజిక వర్గాన్ని కూడా పొన్నం అవమానించే రీతిలో మాట్లాడం బాధించిందన్నారు. నేను మంత్రి కావడం, మా సామజిక వర్గంలో పుట్టడం తప్పా అంటూ అడ్లూరి ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ లాగా అహంకారంగా మాట్లాడడం నాకు రాదు..పొన్నం మారకపోతే జరిగే పరిణామాలు ఆయనే బాధ్యత వహించాలన్నారు. వివేక్ లాగా నా వద్ద డబ్బులు లేవు.. పొన్నం ఆయన తప్పు తెలుసుకుంటాడునుకున్నానన్నారు. నేను కాంగ్రెస్ జెండా నమ్ముకున్న వాడిని.. మంత్రి గా మూడు నెలల ప్రోగ్రెస్ చూసుకోండి.
నేను మాదిగ ను కాబట్టి మంత్రి పదవి వచ్చింది.. నేను మంత్రి కావడం, మా సామజిక వర్గంలో పుట్టడం నా తప్పా.?! నేను కుర్చీలో కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నాడు. నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు అన్నారు.

కాగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఇద్దరు మంత్రులతో ఫోన్ లో మాట్లాడినట్లు వెల్లడించారు. సమన్వయంతో కలిసి పని చేసుకోవాలని, ఒకరికొకరు సహకరించుకొని పని చేయాలని సూచించినట్లుగా తెలిపారు. పీసీసీ అధ్యక్షుల చొరవతో సమస్య సద్దుమణిగిందన్నారు.