విధాత, హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆర్టీసీ సంస్థ పరిరక్షణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ నెల 22నుంచి తలపెట్టిన సమ్మె నిర్ణయాన్ని ఆర్టీసీ కార్మికులు వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలను సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని తెలిపారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాలకు సంబంధించిన అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, ఈ రెండు అంశాలు తప్ప మిగతా ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలు వినేందుకు ఎల్లవేళలా తమ తలుపులు తెరిచి ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.
ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ అమలులోకి తీసుకువచ్చామని, ప్రస్తుతం ఎలాంటి డీఏ బకాయిలు లేవని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అంశం కూడా ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు.
ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సెప్టెంబర్ 2023న కమిటీ ఏర్పాటు చేసిందని ఎన్నికల షెడ్యుల్ కు 10 రోజులకు ముందు హడావిడిగా విలీనం అంశాన్ని ముందుకు తీసుకువచ్చారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా , కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, జీఎడి సెక్రటరీ, రోడ్డు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ సభ్యులుగా ఉన్నారని తెలిపారు.
కమిటీ ఏర్పాటు అయిన 10 రోజుల్లోనే అక్టోబర్ 10, 2023న ఎన్నికల షెడ్యూల్ విడుదలై, నవంబర్ 30న ఎన్నికలు జరిగి, డిసెంబర్ 3న ఫలితాలు వచ్చాయని మంత్రి పొన్నం గుర్తు చేశారు. డిసెంబర్ 7, 2023న ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కుదురుకోక ముందే , మార్చి 16, 2024న లోకసభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో జూన్ 6 వరకు సుదీర్ఘంగా ఎన్నికల కోడ్ అమలులో ఉందని వివరించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు మహా లక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి, ఆర్టీసీ సేవలను బలోపేతం చేసినట్లు మంత్రి తెలిపారు. ఒకప్పుడు ఉనికికే ప్రశ్నార్థకంగా ఉన్న ఆర్టీసీ, ప్రస్తుతం 90కి పైగా డిపోలు లాభాల్లో నడుస్తున్నాయని వెల్లడించారు.
ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌలభ్యం ఈ మూడు అంశాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగుల ప్రభుత్వ విలీనంపై సంస్థ, ఉద్యోగుల అంశాలు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై కమిటీ సమగ్ర అధ్యయనం అవసరమని చెప్పారు.
ప్రస్తుతం ఆర్టీసీ క్రమంగా కోలుకుంటున్న సమయంలో సమ్మె నిర్ణయం సరైంది కాదని, ఇది సంస్థకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీకి అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. గతంలో రూ.1205 కోట్లుగా ఉన్న పీఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు తగ్గించామని, రూ.690 కోట్లుగా ఉన్న సీసీఎస్ బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించామని చెప్పారు.
ఇప్పటి వరకు 2978 కొత్త బస్సులను ప్రవేశపెట్టడంతో పాటు, 1134 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. కొత్త ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలు పూర్తయ్యాయని, త్వరలోనే వారు విధుల్లోకి రానున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి :
ట్రంప్ ‘నో ట్యాక్స్ ఆన్ టిప్స్’ క్యాంపెయిన్ !
బీహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి..?
