విధాత,మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :తెలంగాణ రాష్ట్రం లో విద్యా రంగానికి సువర్ణాధ్యాయం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్ లో పీఆర్టీయు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రభుత్వానికి కృతజ్ఞత సభ’ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ లో ప్రజలు మార్పు కోరి ప్రజా ప్రభుత్వానికి అవకాశం కల్పించారన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్ష మేరకే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు పూర్తి స్థాయిలో ఎవరి ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా తమ విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ముఖ్యమంత్రికి గాని , మంత్రులను గాని కలిసి స్వయంగా తెలియజేయవచ్చు యెన్నం పేర్కొన్నారు. సియం ఆదేశాల మేరకు ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల విషయంలో పారదర్శకంగా పనిచేసానన్నారు. భవిష్యత్తు లో జరిగే పదోన్నతులు, బదిలీల విషయంలో ఎవరి ప్రమేయం ఉండదన్నారు.
పదేళ్ల లో తెలంగాణ ను విధ్వంసం చేసి వారు , తెలంగాణ ఆకాంక్షను దెబ్బతీసి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమం స్పూర్తి తో వివిధ వేదికల ద్వారా మన ఆకాంక్ష ఎలా నెరవేర్చుకున్నామో,అలాగే ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు చేరవేయడానికి ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఇతర పార్టీ ల నేతలు విమర్శలు చేస్తే సంతోషంగా స్వీకరిస్తామని, అధికారికంగా విమర్శలు చేస్తే ఎలాంటి చర్యలు ఉండవన్నారు.ప్రస్తుతం సాంకేతిక రంగం పెరిగిందని, భవిష్యత్తు లో ఉపాద్యాయులకు కూడా ఉత్తమ శిక్షణ ఇప్పించి దృశ్య శ్రావణం ద్వారా నాణ్యమైన విద్యను ప్రతి పాఠశాలలో అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఉన్నారని ఆయన తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, విద్యార్థులను నిష్ణార్థులగా తయారు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూధన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్, గద్వాల జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సరితమ్మ , పీఆర్టీయు వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, శ్యాంబాబు, రాజేందర్ రెడ్డి, గట్టు వెంకట్ రెడ్డి , శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Yennam Srinivas Reddy | విద్యా రంగానికి సువర్ణాధ్యాయం .. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
