విధాత: వరంగల్ జిల్లా జక్కలొద్ది ప్రాంతంలోని పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చి, గద్దెలను, సిపిఐ(ఎం) జెండాలను తొలగించి బలవంతంగా బిఆర్ఎస్ జెండాలను కట్టి నాయకులపై బెదిరింపులకు పాల్పడ్డాన్ని సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్రకమిటి తీవ్రంగా ఖండిస్తున్నదని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో తెలిపారు.
గురువారం ఉదయం 5 గంటలకే ముందస్తు పథకం ప్రకారం తూర్పు వరంగల్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ 100 మంది గూండాలను తీసుకువచ్చి గుడిసె వాసులపై దౌర్జన్యానికి పూనుకున్నారన్నారు. రంగసాయిపేట ఏరియా కార్యదర్శి మాలోతు సాగర్, గణపాక ఓదేలు, ప్రత్యూషలపై తప్పుడు ఫిర్యాదు చేసి అరెస్టు చేయించారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న గుడిసెలను పీకేస్తామని, గుడిసెవాసులంతా బిఆర్ఎస్ పార్టీలో చేరాలని, కండువాలను కప్పుకోవాలని బెదిరించారన్నారు. లేదంటే గుడిసెలన్నింటినీ నేలమట్టం చేస్తామని హుంకరించారని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో సంమయమనంతో ఉండాల్సిన అధికారపార్టీ నాయకులు, ఇతర రాజకీయ పార్టీల నాయకులపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. తక్షణమే పేదల గుడిసెలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్రకమిటీ డిమాండ్ చేస్తున్నదన్నారు. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.