దమ్ముంటే ఆ పార్టీలు బీసీని సీఎం చేయాలి.. కిషన్‌రెడ్డి సవాల్‌

  • Publish Date - November 22, 2023 / 02:43 PM IST

విధాత : కాంగ్రెస్‌, బీఆరెస్‌లకు దమ్ముంటే తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని కేంద్ర మంత్రి, తెలంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సవాల్ చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. ఎన్నికల్లో బీజేపీ సత్తా పోలింగ్ రోజు ఆ వర్గాల ఓట్లతో తేలుతుందన్నారు. కేసీఆర్ తన కుమారుడు సీఎం అవుతారని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. మెడికల్ కళాశాలల కోసం వంద ఉత్తరాలు రాసినట్టు చెబుతున్న కేసీఆర్ ఆ ఉత్తరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.


రీజినల్ రింగ్ రోడ్డు ఎందుకు అలస్యమవుతోందో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ కుటుంబానికి అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేసిన చరిత్ర మూటకట్టుకుందన్నారు. బొగ్గు నుంచి హెలికాప్టర్లు, 2జీ వరకు అన్ని స్కామ్‌లే చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకోసారి ముఖ్యమంత్రి మారతారని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు ప్రజలు అవకాశం ఇవ్వరన్నారు. బొగ్గు నుంచి హెలికాప్టర్ల వరకు కాంగ్రెస్ కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు రావాలన్నారు