విధాత: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఈనెల 14 నుంచి ‘జన జాగరణ యాత్ర’లు చేపట్టాలని ఏపీ కాంగ్రెస్ నిర్ణయించింది. యాత్రను 14న లాంఛనంగా ప్రారంభించి 19 నుంచి 15 రోజులపాటు నిర్విరామంగా కొనసాగిస్తారు. ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ప్రతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో పాదయాత్రలు, సభలు నిర్వహిస్తారు. ఈమేరకు జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులతో పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విజయవాడలో సమావేశమయ్యారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయని, రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందని, వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తీర్మానించారు, విజయవాడలో నవంబరు 9న సభ్యత్వ నమోదును ప్రారంభించాలని నిర్ణయించారు.
సమావేశం అనంతరం శైలజానాథ్ విలేకరులతో మాట్లాడుతూ అమరావతి రైతుల మహా పాదయాత్రకు అండగా నిలుస్తామన్నారు. వైకాపా అధికారంలోకొచ్చిన నాటి నుంచి కూల్చివేతలు, విధ్వంసాలు, అరాచకాలు తప్ప అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. ప్రశ్నించే హక్కును కూడా కాలరాస్తున్నారని, పార్టీలకు అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ లేకుండా చేయడం దుర్మార్గమని విమర్శించారు. సమావేశంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్ మస్తాన్వలీ, పీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు, ఎస్సీ విభాగం ఛైర్మన్ కొరివి వినయ్ తదితరులు పాల్గొన్నారు.