అప్పులకు హామీగా ప్రభుత్వ ఆస్తులు!

విశాఖలోని సర్కారు భూములపై ఆరాసీసీఎల్‌ఏకు త్వరలో నివేదికచర్చనీయాంశంగా మారిన వ్యవహారం విధాత,విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ) తీసుకొనే రుణాలకు విశాఖలోని ప్రభుత్వ భూములను హామీ (కొలేటరల్‌ సెక్యూరిటీ)గా పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు నగరంలోని 20 ప్రభుత్వ శాఖల పరిధిలోని సుమారు 220 ఎకరాలను ఏపీఎస్‌డీసీకి బదలాయించేందుకు రంగం సిద్ధమవుతోంది. గత ఏడాది జిల్లాల పునర్విభజన నిమిత్తం ప్రభుత్వ శాఖల వారీగా ఆస్తుల వివరాలను సేకరించి పంపారు. అవన్నీ రాష్ట్ర భూ […]

  • Publish Date - June 11, 2021 / 04:26 AM IST

విశాఖలోని సర్కారు భూములపై ఆరా
సీసీఎల్‌ఏకు త్వరలో నివేదిక
చర్చనీయాంశంగా మారిన వ్యవహారం

విధాత,విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ) తీసుకొనే రుణాలకు విశాఖలోని ప్రభుత్వ భూములను హామీ (కొలేటరల్‌ సెక్యూరిటీ)గా పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు నగరంలోని 20 ప్రభుత్వ శాఖల పరిధిలోని సుమారు 220 ఎకరాలను ఏపీఎస్‌డీసీకి బదలాయించేందుకు రంగం సిద్ధమవుతోంది. గత ఏడాది జిల్లాల పునర్విభజన నిమిత్తం ప్రభుత్వ శాఖల వారీగా ఆస్తుల వివరాలను సేకరించి పంపారు.

అవన్నీ రాష్ట్ర భూ పరిపాలన వ్యవహారాల కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) వద్ద ఉన్నాయి. అక్కడ నుంచి నిర్దేశించిన ప్రభుత్వ ఆస్తుల జాబితా కలెక్టరేట్‌కు చేరింది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్డీవో ఆధ్వర్యంలో నాలుగు మండలాల తహసీల్దార్లు రంగంలోకి దిగారు. మహారాణిపేట, సీతమ్మధార, గోపాలపట్నం, చినగదిలి తహసీల్దార్‌ కార్యాలయాల అధికారులు రెండు రోజులుగా తమ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల ఆస్తుల వివరాలను ఆరా తీస్తున్నారు. ఆయా భూముల సర్వే సంఖ్యలు, విస్తీర్ణం, మార్కెట్‌ విలువ, స్కెచ్‌లు, అందుబాటులో ఉన్న ఇతర దస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. వారం రోజుల్లో పూర్తి నివేదికను సీసీఎల్‌ఏకు పంపుతామని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. హామీగా ఇవ్వనున్న ఆస్తుల్లో గవర్నర్‌ బంగ్లా, కలెక్టరేట్‌ భవన సముదాయంతో పాటు రెండు తహసీల్దార్‌ కార్యాలయాల భవనాలు కూడా ఉండటం గమనార్హం.
అప్పులకు హామీగా ప్రభుత్వ ఆస్తులు!
భవిష్యత్తులో ఏమవుతుందో?
ఇప్పటికే విశాఖలో విలువైన భూములను ‘బిల్డ్‌ ఏపీ ప్రాజెక్టు’ కింద ప్రభుత్వం బహిరంగ వేలం పద్ధతిలో ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. కొంతమంది హైకోర్టుకు వెళ్లడంతో భూముల అమ్మకాలపై స్టే ఇచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్తులను రుణాల కోసం హామీ పెడుతున్నారన్న అంశం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు హామీ అంటారని, భవిష్యత్తులో ఏం జరుగుతుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికార వర్గాలు మాత్రం ప్రభుత్వ ఆస్తులను హామీగా పెట్టి రుణం తీసుకోవడం కొత్తేమీ కాదని, దీనివల్ల రుణాలిచ్చే సంస్థలకు వాటిపై ఎలాంటి అధికారాలూ ఉండవని చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియలో భాగంగానే విశాఖలో ఉన్న ఆస్తుల వివరాలనూ అందజేయాలని ఆదేశాలు వచ్చినట్లు పేర్కొన్నాయి.
బదలాయింపు ఇలా
ప్రభుత్వ శాఖల భూములను ఏపీఎస్‌డీసీకి బదలాయించాలంటే.. తొలుత కలెక్టరేట్‌ నుంచి సీసీఎల్‌ఏ కార్యాలయానికి ప్రతిపాదనలు వెళ్తాయి. అక్కడ పరిశీలన తర్వాత మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బదలాయింపు ప్రతిపాదనలు ప్రస్తుతం సిద్ధమవుతున్నాయి. ఇదంతా గుట్టుగా చేయాలని రెవెన్యూ యంత్రాంగం భావించినా బహిర్గతమవడంతో ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం.
వివరాలు సేకరిస్తున్న భూములు (ఎకరాల్లో)

  • పాలిటెక్నిక్‌ కళాశాల స్థలం: 23.58 ఎకరాలు
  • మహారాణిపేట తహసీల్దార్‌ కార్యాలయం: 2.15
  • బక్కన్నపాలెంలోని సెరికల్చర్‌ కార్యాలయం: 5.35
  • మహారాణిపేట గ్రంథాలయ సంస్థ స్థలాలు: 1.93
  • బీచ్‌రోడ్డులోని జిల్లా శిక్షణ కేంద్రం: 0.95
  • గోపాలపట్నం రైతుబజార్‌: 3.32
  • కార్మికశాఖ స్థలం (ఎండాడ): ఎకరం
  • చినగదిలిలోని ఈవీఎం గోదాము: అర ఎకరం
  • ఏయూ స్థలం (ఎండాడ): 90.43
  • డైరీఫాం స్థలం (చినగదిలి): 35
  • కలెక్టరేట్‌ భవన సముదాయం: 2.62
  • బక్కన్నపాలెంలోని టీసీపీసీ కేంద్రం: 12
  • అటవీశాఖ అతిథిగృహం: 3
  • రెవెన్యూ క్వార్టర్స్‌ (సీతమ్మధార): 3
  • సీతమ్మధార తహసీల్దార్‌ కార్యాలయం: ఎకరం
  • పాత డెయిరీఫారం వద్ద పశుసంవర్థకశాఖ స్థలం: 5
  • గవర్నర్‌ బంగ్లా: 5 ఎకరాలు
    వీటితో పాటు మరో రెండు కార్యాలయాలకు చెందిన స్థలాలున్నాయి. ఇవన్నీ కలిపి దాదాపు 220 ఎకరాల్లో విస్తరించి ఉన్నట్లు సమాచారం.
  • పశుసంవర్థక శాఖకు చినగదిలి ప్రాంతంలో 105 ఎకరాల వరకు ఉంది. ఇందులో కొండలు, గెడ్డలు 33 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. మిగిలిన భూమిలో ఏపీఎస్‌డీసీకి 35 ఎకరాలు బదలాయించనున్నారు. మరో రెండెకరాలు పీవీ సింధుకు బ్యాడ్మింటన్‌ అకాడమీ కోసం కేటాయించారు. మరో ఎకరా బధిరుల సంస్థకు ఇచ్చారు. ఇలా మొత్తంగా 71 ఎకరాలు పోగా.. పశుసంవర్థకశాఖకు మిగిలేది 34 ఎకరాలే.
  • మహారాణిపేట తహసీల్దార్‌ కార్యాలయం దేవాదాయశాఖకు చెందిన టర్నర్‌ చౌల్ట్రీ ఆవరణలో ఉంది. దేవాదాయశాఖ భూమిని రెవెన్యూ వర్గాలు ఏ రకంగా ఏపీఎస్‌డీసీకి బదలాయిస్తారో తెలియడం లేదు.