విధాత,విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై గందరగోళం కొనసాగుతోంది. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు కేంద్ర ఆర్థికశాఖ నిరాకరించింది. ఆర్టీఐ కార్యకర్త ఇనుగంటి రవికుమార్ అడిగిన సమాచారం ఇచ్చేందుకు అంగీకరించలేదు. ‘ఉక్కు’లో పెట్టబడులు ఉపసంహరణ అంశం సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8ఎ ప్రకారం ఆర్థిక రహస్యాల పరిధిలోకి వస్తుందని ఆర్థికశాఖ వెల్లడించింది.
ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు లేఖలకు జవాబివ్వాలని పీఎంవో.. డీఐపీఏఎం (డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్మెంట్)కు సూచించింది. ఆర్ఐఎన్ఎల్ విక్రయంపై సమాచారం గోప్యమని పేర్కొంటూ పీఎంవో ఆదేశాలను డీఐపీఏఎం పట్టించుకోలేదు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర కేబినెట్ సిఫారసు చేసింది.
కేంద్ర కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. విశాఖ ఉక్కు పోరాట కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని పునరాలోచించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. భాజపా మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించవద్దని ఉద్యమిస్తు్న్నాయి. కేంద్ర ప్రభుత్వం లోపభూయిష్ట విధానాలవల్లే విశాఖ ఉక్కు నష్టాల్లో కొనసాగుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు.