విధాత:ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాల మీదికి తెచ్చింది.తాను ప్రేమించిన యువకుడిని
పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఒక యువతిపై కుటుంబసభ్యులే పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడ్డారు.ఈ దారుణ ఘటన కడప జిల్లా రాయచోటిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.రాయచోటి సీఐ జి.రాజు కథనం మేరకు…సదరు యువతి స్థానికంగా ఓ యువకుడిని ప్రేమించింది.ఈ వ్యవహారం ఇష్టం లేని కుటుంబసభ్యులు ఆమెకు మరో సంబంధo చూసి పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.అయితే వచ్చిన సంబంధాలన్నీ ఆమె చెడగొడుతోంది.దీంతో కొద్దిరోజులుగా కుటుంబసభ్యులతో ఆమెకు గొడవ జరుగుతోంది.
ఈ క్రమంలోనే మంగళవారం మరోసారి కుటుంబ సభ్యులు పెళ్లి విషయంపై బలవంతం చేయగా ఆమె నిరాకరించింది.తాను ప్రేమించిన వాడిని తప్ప వేరెవరినీ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేసింది.దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, సోదరుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.యువతి కేకలు వేయడంతో ఆమె అక్క, స్థానికులు వచ్చి మంటలు ఆర్పివేశారు.
తీవ్రంగా గాయపడిన ఆమెను కడప రిమ్స్ కు తరలించారు.ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.