రూ.5 వేలు ఇవ్వ‌లేద‌ని త‌ల్లిని చంపి.. డెడ్‌బాడీతో హ‌ర్య‌నా నుంచి యూపీకి ప్ర‌యాణం

ఓ యువ‌కుడు త‌న త‌ల్లి ప‌ట్ల క్రూరంగా ప్ర‌వ‌ర్తించాడు. త‌ల్లి రూ. 5 వేలు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆమెను చంపాడు కుమారుడు. ఆ త‌ర్వాత మృత‌దేహాన్ని సూట్‌కేసులో కుక్కి, హ‌ర్యానా నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు రైల్లో ప్ర‌యాణించాడు

  • Publish Date - December 16, 2023 / 02:16 PM IST

న్యూఢిల్లీ : ఓ యువ‌కుడు త‌న త‌ల్లి ప‌ట్ల క్రూరంగా ప్ర‌వ‌ర్తించాడు. త‌ల్లి రూ. 5 వేలు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆమెను చంపాడు కుమారుడు. ఆ త‌ర్వాత మృత‌దేహాన్ని సూట్‌కేసులో కుక్కి, హ‌ర్యానా నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు రైల్లో ప్ర‌యాణించాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన హిమాన్షు(21) త‌న త‌ల్లితో క‌లిసి హ‌ర్యానాలోని హిస్సార్‌లో ఉంటున్నాడు. డిసెంబ‌ర్ 13వ తేదీన త‌న‌కు రూ. 5 వేలు కావాల‌ని త‌ల్లిని హిమాన్షు కోరాడు. కానీ డ‌బ్బులు ఇచ్చేందుకు ఆమె అంగీక‌రించ‌లేదు. దీంతో ఆగ్రహాంతో ఊగిపోయిన హిమాన్షు త‌న త‌ల్లి గొంతు నులిమి ఊపిరి తీశాడు.


ఇక అదే రోజు సాయంత్రం త‌ల్లి మృత‌దేహాన్ని సూట్‌కేసులో కుక్కాడు. అనంత‌రం హ‌ర్యానా నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌కు హిమాన్షు త‌ల్లి డెడ్‌బాడీతో ప్ర‌యాణించాడు. ప్ర‌యాగ్‌రాజ్‌లో దిగిన హిమాన్షు అనుమానాస్ప‌దంగా తిరుగుతుండ‌టంతో పోలీసులు గ‌మ‌నించి, అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం సూట్‌కేస్‌ను ప‌రిశీలించ‌గా, త‌ల్లి డెడ్‌బాడీ బ‌య‌ట‌ప‌డింది. దీంతో హిమాన్షును పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు న‌మోదు చేశారు. హిస్సార్‌లో గ‌త ఆరు నెలల నుంచి అద్దె ఇంట్లో ఉన్న‌ట్లు తేలింది. చివ‌రిసారిగా డిసెంబ‌ర్ 13న హిమాన్షు త‌ల్లిని చూసిన‌ట్లు ఇంటి య‌జ‌మానురాలు పోలీసుల‌కు తెలిపింది.