నల్గొండ, విధాత: పెద్దవూర మండలం పోతునూరు గ్రామానికి చెందిన రైతు పెండ్యాల నరసింహారావు (67) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలివి. రైతు తనకున్న వ్వయసాయ పొలంలో వరి సాగు చేస్తున్నాడు. ఉదయం పంటకు నీరు పెట్టేందుకు రైతు పొలానికి వెళ్లాడు. అక్కడ ఫీజు వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురయ్యాడు. ప్రమాదంలో రైతు నరసింహారావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. గ్రామ రైతులు మాట్లాడుతూ ఇటీవల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోందని, గత కొద్ది రోజులుగా కరెంటు సరిగ్గా రాక నిత్యం ఫీజులు కొట్టేస్తున్నాయని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజు కొట్టి వేయడంతో సరి చేసేందుకు వెళ్లి మృతి చెందాడని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి వరకు నవ్వుతూ తోటి రైతులతో గడిపిన నరసింహారావు మృతితో గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు.