Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. జూలై మాసానికి సంబంధించిన ప్రత్యేక దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవా కోటా ఆన్లైన్లో విడుదల చేయనున్నది. ఏప్రిల్ 18న ఉదయం 10 గంటల నుంచి 20న ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడీప్ కోసం నమోదు చేసుకునే అవకాశం ఇచ్చింది. 22న మధ్యాహ్నం 12గంటల్లోగా సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఏప్రిల్ 22న ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనున్నది.
23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, అదే రోజున ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. 23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనున్నది. 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచనున్నది. 24న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేయబోతున్నది. 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది. ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సూచించింది.