TG EDCET 2024 Results : రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఎడ్సెట్-2024 ఫలితాలు ఇవాళ (జూన్ 11న) వెల్లడికానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్ మాసబ్ట్యాంకులోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఫలితాలను వెల్లడించనున్నారు. అనంతరం ఫలితాలను అధికారిక వెబ్సైట్ https://edcet.tsche.ac.in/ లో అందుబాటులో ఉంచనున్నారు.
ఈ ఏడాది మే 23న రెండు సెషన్లలో టీజీ ఎడ్సెట్-2024 ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్లో, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో సెషన్లో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు మొత్తం 33,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొదటి సెషన్లో నిర్వహించిన పరీక్షకు 16,929 మందికిగానూ 14,633 మంది, రెండో సెషన్ 16,950 మందికిగానూ 14,830 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 87% హాజరు నమోదైంది.
ఈ ఏడాది నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎడ్సెట్ పరీక్షల నిర్వహణ బాధ్యత తీసుకుంది. ఎడ్సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా రెండేళ్ల బీఎడ్ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో మొత్తం 14,285 బీఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.