Paracitamol : కొద్దిగా జ్వరంగా అనిపించినా, కొంచెం నీరసంగా ఉన్నా, కాస్త ఒంట్లో నొప్పులు ఉన్నా.. చాలామంది చేసేపని పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకోవడం. చాలామంది ఇళ్లలో ఏ మెడిసిన్ ఉన్నా, లేకపోయినా పారాసిటమాల్ ట్యాబ్లెట్ షీట్ మాత్రం కచ్చితంగా ఉంటుంది. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పి.. ఇలా ప్రతి చిన్న సమస్యకు పారాసిటమాల్ వేసుకోవడం అలవాటుగా మారింది ఎక్కువ మందికి. ఈ అలవాటు మంచిది కాదని, దీనివల్ల భవిష్యత్తులో చాలా దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పారాసిటమాల్ టాబ్లెట్లను అతిగా వాడడంవల్ల రానురాను మోషన్స్ కావడం, కళ్లు తిరగడం, వాంతులు చేసుకోవడం లాంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయట. కొంతమందికి అలర్జీలు వస్తాయట. పారాసిటమాల్ ట్యాబ్లెట్లను అదేపనిగా వాడడంవల్ల భవిష్యత్తులో మూత్ర పిండాలు, కాలేయం లాంటి అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందట.
అదేవిధంగా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే దానిలో ఉండే కాంపౌండ్స్ ఆల్కహాల్లోని ఇథనాల్తో నెగెటివ్ రియాక్షన్ జరిపి అవయవాలను దెబ్బతీసే ప్రమాదం ఉంటుందట. పారాసిటమాల్ ట్యాబ్లెట్ను ఆహారంతో లేదా పండ్ల రసంతో కలిపి తీసుకోవచ్చట. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి చీటికిమాటికి పారాసిటమాల్ వేసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.
కాగా ఈ పారాసిటమాల్ను పెద్దవాళ్లయితే సాధారణంగా 500 ఎంజీ డోస్ తీసుకోవచ్చు. పిల్లలకు తక్కువ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. శరీరంలో తేలికపాటి నొప్పులు ఉన్నప్పుడు లేదా లైట్గా ఫీవర్ వచ్చినప్పుడు సేఫ్టీ కోసం ఒక ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. జ్వరం తగ్గకపోతే ఒకటి రెండు రోజులు రోజుకు రెండు చొప్పున పారాసిటమాల్ వాడొచ్చు. అయినా సమస్య తగ్గకపోతే వెంటనే డాక్టర్ను కలవడం మంచిది.