ఇస్రో సూర్య నమస్కారం.. తుది గమ్యం చేరిన ఆదిత్య ఎల్‌1

ఇప్పటికే చందమామను అందుకున్న ఇస్రో.. ఇప్పుడు సూర్యుడికి దగ్గరకు వెళ్లింది. తొలిసారి చేపట్టిన సోలార్‌ మిషన్‌.. తన గమ్యస్థానానికి విజయవంతంగా చేరుకున్నది.

  • Publish Date - January 6, 2024 / 11:48 AM IST

  • దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి తన ఘనతను చాటుకున్నది. ఇప్పటికే విజయవంతంగా చందమామను అందుకున్న ఇస్రో.. ఇప్పుడు సూర్యడికి అత్యంత దగ్గరగా వెళ్లింది. తొలిసారి చేపట్టిన సోలార్‌ మిషన్‌.. తన గమ్యస్థానానికి విజయవంతంగా చేరుకున్నది. ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్‌1.. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో తన అంతిమ విన్యాసం పూర్తి చేసి.. తుది కక్ష్యలోకి (లాగ్‌రేంజ్‌ 1) ప్రవేశించింది. సూర్యుడిపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఇది ఇస్రోకు ఉపకరిస్తుంది.


ప్రస్తుతం ఆదిత్య ఎల్‌1 భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ మిషన్‌ను ఇస్రో గత ఏడాది సెప్టెంబర్‌ 2న చేపట్టింది. సుదీర్ఘ ప్రయాణం అనంతరం చివరకు తన తుది గమ్యానికి చేరుకున్నది. సూర్యుడికి, భూమికి మధ్య ఉన్న దూరంలో ఎల్‌1 పాయింట్‌ అనేది ఒక శాతం దూరం. ఎల్‌-1 పాయింట్‌ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని హాలో ఆర్బిట్‌ అని పిలుస్తారు. ఇక్కడ సూర్యుడికి, భూమికి మధ్యలో ఉండే గురుత్వాకర్షణ శక్తి సమతుల్యంగా ఉంటుంది. సూర్యగ్రహణాల వంటివి ఏర్పడిన సమయంలోనూ ఇక్కడి నుంచి సూర్యుడిని పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా సూర్యుడి కార్యకలాపాలు, గగనతలంలో అది చూపే ప్రభావాన్ని పరిశీలించేందుకు ఈప్రాంతం ఎంతగానో దోహదపడుతుంది.


ప్రధాని మోదీ శుభాకాంక్షలు

తన తుది గమ్యమైన లాగ్‌రేంజ్‌ పాయింట్ 1కు ఆదిత్య ఎల్‌1 మిషన్‌ చేరుకోవడంపై ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం మరో మైలురాయిని అధిగమించిందన్నారు. ఇది మన శాస్త్రవేత్తల అకుంఠిత దీక్షకు నిదర్శనమని చెప్పారు. అత్యంత క్లిష్టమైన ప్రయోగాన్ని విజయవంతం చేశారంటూ అభినందించారు. మానవాళికి ఉపయోగపడే నూతన శాస్త్రీయ ప్రయోగాల నిర్వహణను భారత్‌ కొనసాగిస్తుందని చెప్పారు.

Latest News