13 మంది ప్రపంచ నేతలపై ‘మార్నింగ్ కన్సల్ట్’ సర్వేలో వెల్లడి
విధాత: ప్రపంచంలో 13 మంది నేతల్లో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకునిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. ప్రజల్లో 70% మంది ఆదరణ ఆయనకు ఉందని అమెరికాకు చెందిన ‘మార్నింగ్ కన్సల్ట్’ సర్వే సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. సర్వేలో పాల్గొన్న వయోజనుల్లో 25% మంది మాత్రమే ఆయన పట్ల వ్యతిరేకత కనపరిచారు. ప్రతి వారం ఈ గణాంకాలను తాజా పరుస్తుంటారు. ఈ నెల 2వ తేదీ నాటికి ఉన్న సమాచారం ప్రకారం మోడీ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మేన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్, ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి ఉన్నారు. ఇంతకు ముందు వారం కూడా ప్రజామోదంలో మోడీయే ముందున్నారు. జూన్లో మాత్రం ప్రజాదరణ 66 శాతానికి తగ్గింది. 2019 ఆగస్టులోనైతే ఆయన్ని 82% మంది ఇష్టపడేవారు.
జపాన్ ప్రధానికి ప్రజల తిరస్కరణ ఎక్కువ
వివిధ దేశాల నేతలకు ప్రజల నుంచి తిరస్కరణ ఏ స్థాయిలో ఉంటోందో సర్వేలో తెలుసుకున్నప్పుడు అందరి కంటే పైన జపాన్ ప్రధాని సుగా నిలిచారు. 64% మంది ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ జాబితాలో చిట్టచివరన మోడీ ఉన్నారని సర్వే సంస్థ తెలిపింది.
సర్వే ఎలా చేస్తారంటే
ఎన్నికలు, పోలింగును ప్రభావితం చేసే అంశాలు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ఉన్న ఆదరణ వంటి అంశాలపై మార్నింగ్ కన్సల్ట్కు చెందిన రాజకీయ విభాగం సమాచారాన్ని సేకరిస్తుంటుంది. ప్రతిరోజూ ప్రపంచంలో దాదాపు 11 వేల మందిని ప్రశ్నించి, నేతలకు ఉన్న ఆదరణను తెలుసుకుంటుంది. ఒక్క అమెరికా అధ్యక్షునికి సంబంధించి ఆ దేశంలో రోజూ 5,000 మందిని ఇంటర్వ్యూ చేస్తుంటుంది. ఇదంతా ఆన్లైన్లో జరుగుతుంది. ఒక దేశంలో ఒక వారంలో సర్వేలో వయోజనులు చెప్పిన సమాచార సగటును సంస్థ క్రోడీకరిస్తుంది.