Trump-Putin Alaska Summit | ఆలాస్కాలో ట్రంప్ – పుతిన్‌ శిఖరాగ్ర భేటీ : ఆర్భాటమే తప్ప ఒప్పందం లేదు

ఆలాస్కాలో ఘనంగా జరిగిన ట్రంప్ – పుతిన్‌ శిఖరాగ్ర సమావేశం విజయవంతమైందని చెప్పినా, యుక్రెయిన్‌ యుద్ధ విరమణపై ఎటువంటి ఒప్పందం సాధ్యం కాలేదు.

: Former U.S. President Donald Trump and Russian President Vladimir Putin Walk side by side on a red carpet during the Alaska Summit 2025.

Trump-Putin Alaska Summit | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య ఆగస్టు 15న అమెరికాలోని ఆలాస్కా రాష్ట్ర రాజధాని యాంకరేజ్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపింది. దాదాపు పదేళ్ల తర్వాత అమెరికా నేల మీద అడుగుపెట్టిన పుతిన్‌కు ఎర్ర తివాచీ పరచి, లిమోసిన్‌లో ట్రంప్‌తో కలిసి ప్రయాణం చేయించి, సైనిక గౌరవ వందనాలు, విమాన విన్యాసాలు వంటి ఘన స్వాగతం అందించడం ఆ సమావేశానికి ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఈ వేడుకల ఆర్భాటం చూస్తుంటే రాబోయే చర్చల ద్వారా యుద్ధ మేఘాలు తొలగిపోతాయనే ఆశ కలిగినా, వాస్తవానికి ఆ విశ్వాసం కలలాగానే మిగిలిపోయింది.

దాదాపు మూడు గంటలపాటు మూసిన తలుపుల వెనుక చర్చలు జరిపి, అనంతరం ఇద్దరూ పక్కపక్కనే నిలబడి పత్రికా ప్రతినిధుల ముందు ప్రత్యక్షమయ్యారు. కానీ అక్కడ కూడా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, కేవలం “చర్చలు ఫలప్రదమయ్యాయి” అనే మాటలకే పరిమితమయ్యారు. ట్రంప్ తన వైఖరికి అనుగుణంగా “మేము కొంత పురోగతి సాధించాం, కానీ ఒప్పందం ఎప్పుడంటే అప్పుడే ఒప్పందం” అని తేలికగా వ్యాఖ్యానించగా, పుతిన్ మాత్రం నర్మగర్భంగా మాట్లాడుతూ “యుద్ధానికి మూలకారణాలను పరిష్కరించాలి” అని వ్యాఖ్యానించాడు. దీని అర్థం, యుక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధ విరమణ చర్చల్లో తక్షణ ఫలితం సాధ్యం కాదనే సంకేతం.

ట్రంప్ ముందుగానే ఈ సమావేశాన్ని చరిత్రాత్మక ఒప్పందానికి వేదిక చేయాలని భావించినా, వాస్తవానికి ఆయన చేతికి ఏ ఒప్పందమూ దక్కలేదు. యుద్ధ విరమణపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా సమావేశం ముగియడం ఆయన దౌత్య ప్రతిష్టపై ప్రశ్నలు లేవనెత్తింది. కానీ మరోవైపు, ఎలాంటి రాయితీలు ఇవ్వకుండానే పుతిన్ అంతర్జాతీయ వేదికపై తన బలం చాటుకున్నాడని విశ్లేషకులు అంటున్నారు. యుద్ధం మధ్యలో అమెరికాకు వచ్చి, ఎర్ర తివాచీ స్వాగతం పొంది, గౌరవ వందనాలు అందుకోవడం ద్వారా పుతిన్ తన స్థాయి అంతర్జాతీయంగా మరింత బలపడేలా చేసుకున్నాడు. ఈ మీటింగ్ను విజయవంతం చేసి, మరో యుద్ధాన్ని ఆపగలిగాను అని చెప్పుకుని, నోబెల్ బహుమతి కొట్టేయాలన్న ట్రంప్ ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి.

యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం ఈ భేటీపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమను పక్కన పెట్టి, తమ భూభాగాలపై ఎలాంటి ఒప్పందాలు కుదిరినా, అవి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆయన గట్టిగా ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ నేతలు కూడా అదే స్వరాన్ని వినిపిస్తూ, యుక్రెయిన్‌ను పక్కన పెట్టి ఏ చర్చ జరగకూడదని హెచ్చరించారు. కానీ ఇంత జరుగుతుండగానే, రష్యా యుద్ధభూమిలో కొత్త దాడులు జరపడం, యుద్ధ విరమణ చర్చలన్నీ కేవలం ఆర్భాటాలకే పరిమితమయ్యాయని మరోసారి రుజువు చేసింది.
సమావేశం ముగిసిన తర్వాత ట్రంప్ మరోసారి మాస్కోలో భేటీకి సిద్ధమని ప్రకటించడం అమెరికా రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. “అమెరికా నేల మీద శాంతి భేటీ ఫలితం రాకపోతే, మాస్కోలో మాత్రం ఏం జరుగుతుంది?” అన్న సందేహం అక్కడి విశ్లేషకులలో వ్యక్తమవుతోంది. మొత్తానికి – ఆలాస్కా శిఖరాగ్ర సమావేశం అంతా హడావుడితో నిండిపోయినా, యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదని చెప్పాలి. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇది మరోసారి విఫల చరిత్రగా మిగిలిపోనుంది.

Latest News