విధాత:ఆగస్టు 5 నుండి UAE లోకి ప్రవేశించడానికి అనుమతిస్తూ అధికారులు ఈరోజు ప్రకటించారు. అయితే, చెల్లుబాటు అయ్యే UAE రెసిడెన్సీ వీసాలు ఉండి, యూఏఈ ఆమోదించిన వ్యాక్సిన్ల రెండు డోసులను పూర్తిచేసుకున్న నివాసితులు మాత్రమే యూఏఈ వచ్చేందుకు అర్హులు అని జాతీయ అత్యవసర సంక్షోభం మరియు విపత్తుల నిర్వహణ సంస్థ (NCEMA) తెలిపింది.
ప్రయాణానికి ముందు వ్యాక్సిన్ రెండవ డోసు పూర్తై కనీసం 14 రోజులు అయ్యి ఉండాలి అని అధికార యంత్రాంగం తెలిపింది. అలాగే, ప్రయాణికులు తమ వ్యాక్సిన్ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.
యూఏఈ లో ఆమోదించబడిన వ్యాక్సిన్లు ఇవి:
ఫైజర్
ఆస్ట్రాజెనెకా లేదా కోవిషీల్డ్
సినోఫార్మ్
స్పుత్నిక్
వీరికి మాత్రం మినహాయింపు:
వ్యాక్సిన్లు తీసుకున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా యూఏఈ లో పనిచేసే వైద్యులు, నర్సులు మరియు సాంకేతిక నిపుణులు ఈ ప్రయాణ నిషేధం నుండి మినహాయించబడ్డారు. అలాగే విద్యా రంగంలో పనిచేస్తున్న నివాసితులు, విద్యార్థులు, ప్రభుత్వ సంస్థలలో పనిచేసే కార్మికులు కూడా అనుమతించబడ్డారు. యూఏఈ లో చికిత్స పూర్తి చేయాల్సిన వారు కూడా మినహాయించబడిన వర్గంలో ఉన్నారు.
మినహాయించబడిన అన్ని వర్గాలు అవసరమైన అనుమతులు పొందేందుకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ సిటిజన్షిప్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సమర్థులైన అధికారులు ఆమోదించిన టీకా సర్టిఫికెట్లను వారు అప్లికేషన్తో పాటు జతపరచాలి. వారు బయలుదేరిన తేదీ నుండి 48 గంటలలోపు గుర్తింపు పొందిన లాబరేటరీల నుండి నెగటివ్ PCR పరీక్షను సమర్పించాలి. ఈ పత్రంలో QR కోడ్ని కలిగి ఉండాలి. తిరిగి యూఏఈ చేరగానే పిసిఆర్ పరీక్ష చేయించుకొని హోమ్ క్వారంటైన్ చేయాలి.