- కాంగ్రెస్, బీజేపీ నేతల తీరు విస్మయానికి గురి చేసింది
- రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
విధాత: ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor case)కు, మహిళా రిజర్వేషన్ల (Women’s reservation) అంశానికి పొంతన లేనే లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ (Boinapalli Vinodkumar) అన్నారు. వేర్వేరు అంశాలను జత చేయడం ఏమిటని ఆయన కాంగ్రెస్, బీజేపీ నేతలను ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy), బీజేపీ రాష్ట్ర నాయకులు బండి సంజయ్ (Bandi Sanjay), డీ.కే. అరుణ (DK Aruna), కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి (Revanth reddy), భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)ల తీరు విస్మయాన్ని కలిగిస్తోందన్నారు.
చట్ట సభల్లో 33% మహిళా రిజర్వేషన్లు సాధించేందుకే కల్వకుంట్ల కవిత దీక్ష చేసిందన్నారు. ఈ నెల 13 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్ననేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi)పై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా కవిత దీక్ష చేసిందన్నారు. చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి రోజుల్లోనే రాష్ట్ర అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన 14వ తేదీ జూన్ 2014 నాడు తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు.
మహిళా రిజర్వేషన్లు కోసం ఆనాడు టీఆర్ఎస్ పార్టీగా, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీగా ఎంపీలు పార్లమెంట్లో పోరాడుతూనే ఉన్నారన్నారు. ప్రధాన మంత్రిగా దేవే గౌడ ఉన్నప్పుడు 1996 సెప్టెంబర్12వ తేదీ నాడు మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారని, 12వ తేదీ సెప్టెంబర్ 2016 నాటికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తాను పార్లమెంట్లో మహిళా బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని పలు మార్లు నిలదీశానన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల తీర్మానాన్ని జత చేస్తూ సీఎం కేసీఆర్ ఢిల్లీకి స్వయంగా వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి మహిళా రిజర్వేషన్ల కోసం పలు దఫాలుగా కోరారన్నారు.