విధాత: ఇన్నాళ్లూ ఇంద్రుడు చంద్రుడు… చాణక్యుడు అని బిరుదులతో తులతూగిన చంద్రబాబు (Chandrababu Naidu)కు యువనేత జగన్ భయాన్ని పరిచయం చేసినట్లుంది. జగన్ దూకుడు తట్టుకోలేక లబోదిబో మంటూ ఈసీ దగ్గరకు ఓ పరుగెత్తాల్సిన పరిస్థితి నెలకొంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన దగ్గర్నుంచి జగన్(YS Jagan Mohan Reddy) హవా కొనసాగుతోంది.
ఆ తరువాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ జగన్ అడుగు బయట పెట్టకుండా చంద్రబాబును భయపెట్టారు. కుప్పంలో కూడా మొత్తం దూకుడు చూపించి బాబును మినిమమ్ స్థానాలకు పరిమితం చేసాడు. మొత్తం 90 శాతానికి మించి స్థానాలు గెలుచుకుని చంద్రబాబుకు గట్టి సవాల్ విసిరారు.
ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకుని సత్తా చూపుదాం అని చంద్రబాబు అనుకున్నా ఆ పప్పులు కూడా ఉడకనివ్వలేదు జగన్. ఇక ఇప్పుడు పట్టభద్రుల, ఉపాధ్యాయ కోటాలో శాసన మండలి ఎన్నికలు వచ్చాయి. ఇక్కడా జగన్ దూకుడు గట్టిగానే ఉన్నట్లు ఉంది. దీన్ని తట్టుకోలేక చంద్రబాబు ఏకంగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసారు. ఇవాళ మరోసారి ఆయన సీఈసీకి ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదు చేయడం గమనార్హం.
ఎన్నికల నియమావళిని వైసీపీ తీవ్రంగా ఉల్లంఘిస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని చంద్రబాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తిరుపతిలో తొమ్మిదో తరగతి చదివిన విజయ అనే మహిళ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అక్రమ ఓటు వేశారని ఎన్నికల సంఘానికి (election commission) ఫిర్యాదు చేశారు. అలాగే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడైన డిప్యూటీ మేయర్ అభినయ్రెడ్డి పోలింగ్ కేంద్రాల్లోకి అక్రమంగా ప్రవేశించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదే సందర్భంలో టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్టు ప్రస్తావించారు. బోగస్ ఓట్లపై ప్రశ్నించిన టీడీపీ నేత దేవనారాయణరెడ్డి, పులిగోరు మురళీలను అక్రమంగా అరెస్ట్ చేశారని సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లోనూ జగన్ హవా కొనసాగుతుందని అంటున్నారు.