విధాత: తెలంగాణ మంత్రి గంగుల కమాలకర్, రాజ్యసభ ఎంపీ గాయత్రీ రవి గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో వీరిద్దరూ సీబీఐ విచారణకు హాజరయ్యారు. శ్రీనివాస్ అరెస్ట్ వ్యవహారంలో సీఆర్పీసీ 160 ప్రకారం సాక్షులుగా హాజరవ్వాలని గంగుల, గాయత్రి రవికి సీబీఐ బుధవారం నోటీసులు జారీ చేసింది.
కాగా కొవ్విరెడ్డి శ్రీనివాస్ గత మూడేళ్లుగా నకిలీ ఐపీఎస్గా చలామణి అవుతూ ఢిల్లీ స్థాయిలో రాయబారాలు సాగిస్తూ అనేక మందిని మోసం చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. దీంతో మూడు రోజుల క్రితం ఢిల్లీలోని తమిళనాడు భవన్లో రూ.కోటి తీసుకుంటుండగా శ్రీనివాస్ను సీబీఐ అరెస్ట్ చేసింది.
ఇటీవల మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గంగుల, ఎంపీ గాయత్రి రవితో శ్రీనివాస్ ఫొటోలు దిగినట్లు సమాచారం. అలాగే ఓ గెట్ టూ గెదర్ కార్యక్రమంలోనూ వీరిని శ్రీనివాస్ కలిసినట్లు సీబీఐ చెబుతోంది. ఈ క్రమంలో వీరిద్దరికీ శ్రీనివాస్తో ఉన్న సంబంధాలపై సీబీఐ ఆరా తీస్తోంది.
సంచలన విషయాలు బయటకు
అయితే ఇదిలాఉండగా ఫేక్ సీబీఐ అధికారి శ్రీనివాస్కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మంత్రి గంగుల కమలాకర్, గాయత్రి రవితో పెద్ద డీల్ కుదుర్చుకున్నారని, సీబీఐలో ఉన్న గ్రానైట్ కేసును మేనేజ్ చేస్తానని ఆ ఫేక్ అధికారి హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతున్నది.
ఇందుకోసం 25 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాన్ని గాయత్రి రవి ఫేక్ అధికారి శ్రీనివాస్కు ఇచ్చారని, ఈ క్రమంలో రవి పంజాగుట్టలోని ఓ జువెలరీ షాపులో బకాయి చెల్లించకుండా ఓ గోల్డ్ గిఫ్ట్ని తీసుకెళ్లి ప్రైవేట్ గెస్ట్హౌస్లో శ్రీనివాస్కు ఇచ్చారని, అదేవిధంగా గ్రానైట్ కంపెనీ అసోసియేషన్ తరఫున 25 లక్షల గిఫ్టు ఇచ్చారని ప్రచారం జరుగుతున్నది.