విధాత: సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తులుగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది జస్టిస్ కేవీ విశ్వనాథన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం వీరిద్దరి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
కొత్త కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ వీరి నియామకాన్ని గురువారం ఆమోదించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జస్టిస్ మిశ్రా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులకుగాను ప్రస్తుతం 32 మంది పనిచేస్తున్నారని ఐదుగురు సభ్యుల కొలీజియం తెలిపింది. ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దినేశ్ మహేశ్వరి, ఎంఆర్ షా ఇటీవలే పదవీ విరమణ చేశారని పేర్కొన్నది.
జూలై రెండో వారంలోపు మరో నాలుగు ఖాళీలు ఏర్పడనున్నాయని తెలిపింది. న్యాయమూర్తుల సంఖ్య మరింత తగ్గుతుందని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో జస్టిస్లు విశ్వనాథన్, మిశ్రా పేర్లను సిఫారసు చేసినట్టు కొలీజియం వెల్లడించింది.