Site icon vidhaatha

King Charles | బ్రిట‌న్‌లో కొత్త నోట్లు.. కింగ్ ఛార్లెస్ చిత్రంతో! ఎప్పటి నుంచంటే..

King Charles |

విధాత: సుమారు 70 ఏళ్లుగా క్వీన్ ఎలిజ‌బెత్ చిత్రంతో ముద్రిత‌మైన బ్రిట‌న్‌ (Britain) క‌రెన్సీ ఇప్పుడు కొత్త రూపు సంత‌రించుకుంది. బ్రిట‌న్ రాజుగా ఛార్లెస్ ప్ర‌మాణ స్వీకారం పూర్తి కావ‌డంతో ఇక నుంచి ఆయ‌న రూపం ఉన్న క‌రెన్సీ మార్కెట్‌లోకి రానుంది. బ్రిటన్‌ రూల్స్‌ ప్రకారం పాత కరెన్సీ నోట్లలో ఉన్న వారు మరణించిన అనంతరం రాజు గానీ, రాణి ఎవరైనా కొత్తగా బాధ్యతలు తీసుకున్న వారి చిత్రంతో కొత్త నోట్లు, నాణాలు ముద్రించడం తరాలుగా అక్కడ అనవాయితీగా వస్తున్నది. అయితే అవి ఎలా ఉంటాయి? ఎప్ప‌టి నుంచి మార్కెట్‌లోకి వ‌స్తాయ‌న్న వివ‌రాలు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

కొత్త‌గా వ‌చ్చే నోట్లు, నాణాలు అన్నీ ఒక్క చిత్రం విష‌యంలో త‌ప్ప అంతా ఒక‌లాగే ఉండ‌నున్నాయి. పాత వాటిపై క్వీన్ ఎలిజ‌బెత్ ఫొటో ఉన్న స్థానంలో కింగ్ ఛార్లెస్ చిత్రాన్ని ముద్రించనున్నారు. గ‌తంలో లాగే 5 పౌండ్ల‌ నోటు ఆకుప‌చ్చ రంగులో, 10 పౌండ్ల‌ నోటు కాషాయం రంగులో, 20 పౌండ్ల‌ నోటు ఊదా రంగులో 50 పౌండ్ల యూరోల నోటు ఎరుపు రంగులో ఉండ‌నున్నాయి.

ఈ నాణాల‌కు ఒక వైపున మాత్ర‌మే ఛార్లెస్ చిత్రం ఉంటుంది. ఆయ‌న చిత్ర‌మే మ‌రొక‌దాన్ని భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌కు అనుగుణంగా స్టాంప్ సైజులో ముద్రించారు. ఇందులో ఛార్లెస్ మ‌న‌ల్ని నేరుగా చూస్తున్న‌ట్లు ఉంటుంది. గ‌తంలో వాటికి ఛార్లెస్ నోట్ల‌కు ప్ర‌ధాన తేడా.. ఆయ‌న కిరీటం ధ‌రించిన ఫొటోను నోట్ల ముద్ర‌ణ‌కు వాడ‌క పోవ‌డ‌మే. గ‌తంలో నోటుపై ఉన్న ప్ర‌తి రాజు లేదా రాణి కిరీటం ధ‌రించిన ఫొటోను మాత్ర‌మే నోట్ల ముద్ర‌ణ‌కు ఉప‌యోగించే వారు. కాగా ఈ నోట్ల‌ను కాగితంతో కాకుండా పాలిమ‌ర్ ప‌దార్థంతో రూపొందిస్తున్నారు. ఈ మార్పు క్వీన్ ఎలిజ‌బెత్ హ‌యాంలోనే అమ‌ల్లోకి వ‌చ్చింది.

ఈ కొత్త నోట్ల డిజైన్‌లు అధికారికంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఇవి మార్కెట్ లోకి ప్ర‌వేశించ‌డానికి కాస్త స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. 2024 మేలో ఇవి సామాన్యుల‌కు చేరొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే మ‌రి క్వీన్ ఎలిజ‌బెత్ చిత్రాల‌తో ఉన్న నోట్లు, కాయిన్లు చెల్లుబాటు అవుతాయా అంటే.. అవుతాయ‌ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ స్ప‌ష్ట‌త ఇచ్చింది.

ప‌ర్యావ‌ర‌ణం, ఆర్థిక ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని.. మార్కెట్‌లో ప్ర‌స్తుతం ఉన్న క‌రెన్సీకి అద‌నంగా అవ‌స‌ర‌మైన నగ‌దునే కొత్త క‌రెన్సీల రూపంలో ప్రింట్ చేసి విడుద‌ల చేస్తామ‌ని బ్యాంకు యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. రాజ కుటుంబం స‌ల‌హాలు, సూచ‌న‌ల మేర‌కు తాము ప‌ని చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేసింది.

ఇదిలాఉండగా ఈ కరెన్సీ విషయంలో మరో ఆసక్తికర అంశం కూడా అండన్‌లో ప్రధానంగా అనవాయితీగా వస్తున్నది. అదేంటంటే కొత్తగా నోట్లను ముద్రించే సమయంలో ఓ స్పెషల్‌గా రాజు గారి పుట్టిన రోజు తేదీని కూడా ఆ నోట్లపై ముద్రించి ఆ నోట్లకు వేలం నిర్వహిస్తారు. వాటిని దనవంతులు చాలామంది కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తారు. మీకు ఆసక్తి ఉందా అయితే 2024 మే వరకు వేచి ఉండండి మరి.

Exit mobile version