విధాత: మన దేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. చాలా మందికి ఆ ఆటంటే ఎంతో ఇష్టం. వల్లమాలిన ప్రేమ, అభిమానం. ఏ మాత్రం అవకాశం దొరికినా బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడటానికి ఆరాటపడతారు. క్రికెట్ పోటీలు ప్రారంభించడానికి వచ్చిన ప్రతీ అతిథి బ్యాట్ పట్టాల్సిందే.. షాట్ కొట్టాల్సిందే.. అలా ఉంటది క్రికెట్ పిచ్చి. ఇలా కొందరు క్రికెట్ పోటీలు ప్రారంభించే క్రమంలో గాయాలపాలయ్యారు. తాజాగా ఒడిశా ఎమ్మెల్యే భూపేంద్ర సింగ్ కూడా బ్యాటింగ్ చేస్తూ పిచ్పై బొక్కాబోర్ల పడ్డారు. తీవ్ర గాయాలతో దవాఖాన పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అసలేం జరిగిందంటే… ఒడిశాలోని నార్ల నియోజకవర్గం ఎమ్మెల్యే భూపేంద్ర సింగ్ ఇటీవల కలహండిలో క్రికెట్ పోటీలు ప్రారంభించేందుకు వెళ్లారు. రిబ్బన్ కట్చేసి పోటీలు ప్రారంభించారు. అనంతరం బ్యాట్ చేతుల్లోకి తీసుకొని క్రికెట్ ఆడబోయారు. పిచ్పై యువకుడు బాల్ వేస్తుండగా, ఎమ్మెల్యే దాని ఆడబోయారు.
ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పి ముఖంపై బొక్కబోర్లా పడ్డారు. తీవ్రంగా గాయపడ్డారు. ఈ దృశ్యాన్ని వీడియో తీసిన కొందరు యువకులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్గా మారింది. ఎమ్మెల్యే బాల్ ఆడుతూ కింద పడిన తీరు చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. మరికొందరు విభిన్నంగా స్పందించారు. రాజకీయ నాయకులు క్రికెట్ పిచ్పై కాకుండా రాజకీయ పిచ్పై ఆడితె బెటరని సలహా ఇచ్చారు.