Site icon vidhaatha

శృతిహాసన్ మళ్లీ బ్రేకప్.. లిస్ట్‌లోకి వచ్చే కొత్త కృష్ణుడు ఎవరో?

విధాత‌: సాధారణంగా పాతకాలం నాటి నాటకాలు, డ్రామాల‌లో ఒక పాత్రను ఒకరే పూర్తిగా పోషించకుండా ఉదాహరణకు కృష్ణుడి పాత్రకు ఒకటవ కృష్ణుడు, రెండవ కృష్ణుడు, మూడో కృష్ణుడు ఇలా వరుస పెట్టి వస్తుంటారు. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే మన లోకనాయకుడు, విశ్వనాయకుడైన కమలహాసన్‌గారి సుపుత్రిక శృతిహాసన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.

ఆమె చాలా విద్యలు నేర్చిన నటి.. అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈమె నటిగా, గాయనిగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రాణించింది. తన 14వ ఏటే తన తండ్రి దర్శ‌కత్వంలో వ‌చ్చిన ‘హే రామ్’ అనే చిత్రంలో బాలనటిగా నటించి, ఆ తర్వాత సంగీతానికి సంబంధించిన విషయాలపై దృష్టి పెట్టింది.

2008లో సోహన్షా దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్’ సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటిగా తొలి సినిమా చేసింది. ఇక తెలుగులో ఈమె 2011లో కే రాఘవేంద్రరావు కుమారుడైన కే ప్రకాష్ దర్శకత్వంలో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ అనే మూవీలో సిద్ధార్థ సరసన నటించింది. ఈమెకు నటన విషయంలోనేమో తెలియదు గాని వ్యక్తిగత జీవితంలో మాత్రం తన తండ్రి అయిన కమలహాసన్‌గారే గురువు.తండ్రిలాగానే బహుముఖ ప్రజ్ఞతో పాటు వరుస పెట్టి భార్యల‌ను మార్చడం త‌న తండ్రికి ఎలా అలవాటో.. అలా శృతిహాసన్ కూడా వ‌రుస‌ పెట్టి బాయ్ ఫ్రెండ్‌లను కాస్ట్యూమ్స్‌ను మార్చినట్టు మార్చుతూ ఉంటుంది.

‘అనగనగా ఓ ధీరుడు’ సమయంలోనే సిద్ధార్థ‌తో ఎఫైర్ నడిపిందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కూడా మరోసారి సిద్ధార్థతో ‘ఓ మై ఫ్రెండ్’ అంటూ ఓ సినిమాలో పలకరించింది. ఐరన్ లెగ్‌గా ముద్ర పడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ‘గబ్బర్ సింగ్’తో టాప్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత రవితేజతో బలుపు, ఎన్టీఆర్‌తో రామయ్య వస్తావయ్యా, రామ్ చరణ్, అల్లు అర్జున్ క‌లిసి నటించిన ‘ఎవడు’, అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’, మహేష్ బాబు ‘ఆగడు, శ్రీమంతుడు’… రవితేజ ‘క్రాక్’ వంటి పలు చిత్రాల్లో నటించింది.

వీటితోపాటు తమిళంలో ఒక నాలుగైదు, హిందీలో ఒక ఐదారు చిత్రాలు చేసింది. ఇంకా నూనుగు మీసాల సిద్ధార్థ్ తర్వాత ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడైన ధనుష్‌తో మరికొంత కాలం ఎఫైర్ నడిపిందనేలా వార్తలు వచ్చాయి. కానీ అది కూడా కొంతకాలమే. దానికి కూడా బ్రేకప్ చెప్పింది. శృతిహాసన్‌తో పాటు సంగీత బృందంలో తిరిగిన మైకేల్ కోర్స్లే అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపింది. దానికి కూడా 2019లో బ్రేకప్ చెప్పింది.

ఇలాంటి ఎఫైర్లపై చూపించే శ్రద్ధ.. నటన, సినిమాలపై చూపించక పోవడం వలన శారీరకంగా విపరీతమైన మార్పులు రావడం, ఫిజిక్ చెడిపోవడం, లావు కావడం, డిప్రెషన్‌లోకి వెళ్లడం.. దాని ఎఫెక్ట్ కెరీర్‌పై పడటం జరిగింది. మానసికంగా కూడా దెబ్బతిన్న ఆమె కెరీర్‌ను నిర్లక్ష్యం చేసింది. తండ్రి కూడా ఆమెను మందలించ లేకపోయాడు. ఎందుకంటే అతను కూడా అలాంటి వాడే కదా…!

ఇలా సినిమాలకు చాలా గ్యాప్ వచ్చిన ఈమె ప్రస్తుతం మరల తన కెరీర్ గాడిలో పెట్టుకునే పనిలో ఉంది. ఒకే సంస్థ అంటే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రెండు చిత్రాలలో ఈమె హీరోయిన్. ఈ రెండు చిత్రాలు కూడా వచ్చే సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఆ రెండు తెలుగులో భారీ చిత్రాలు కావడం విశేషం. టాలీవుడ్‌కి చెందిన టాప్ స్టార్స్ ఈ రెండింటిలో నటిస్తున్నారు.

అందులో ఒకటి జనవరి 12న విడుదల కానున్న నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ‘వీర సింహారెడ్డి’. రెండో చిత్రం కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతూ జనవరి 13న విడుదలకు సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’. ఇలా ఈమె భలే జాక్‌పాట్ కొట్టింది. మ‌రో వైపు పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్‌తో కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తీస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘స‌లార్’‌.

ముందుగా శృతిహాసన్‌ను బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో దర్శకుడు గోపీచంద్ మలినేని ఎంపిక చేశాడు. ఎందుకంటే ఆయన గత చిత్రం అయిన ‘క్రాక్’ మూవీలో ఆమె రవితేజ సరసన‌ నటించింది. ఈ చిత్రం కూడా రవితేజకు గోపీచంద్‌కు అత్యవసరమైన హిట్టును అందించి లక్కును ఇచ్చింది. దాంతో సెంటిమెంట్‌గా గోపీచంద్ మ‌లినేని‌ శృతిహాసన్ మాయలో పడిపోయాడు.

ఇక విషయానికి వస్తే స్టార్ కిడ్ శృతిహాసన్ నేటి జనరేషన్‌లో పుట్టాల్సిన అమ్మాయి కాదు. టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్లో ఒక నాలుగు ఐదు దశాబ్దాల తర్వాత పుట్టాల్సిన నటి. ఎందుకంటే ఆమె చేసే రచ్చ మామూలుగా ఉండదు. అది కూడా బాయ్ ఫ్రెండ్స్‌తో సుమా! ఇలా స్టార్ కిడ్‌ శృతిహాసన్ లైఫ్ స్టైల్ ఎంతో పాశ్చాత్యం. బాలీవుడ్ హీరోయిన్స్ కూడా తమ లవర్స్‌ని ఇంత ఓపెన్‌గా పరిచయం చేయడానికి, తమ రిలేషన్ గురించి చెప్పడానికి భయపడతారు. కానీ శృతి బహిరంగంగానే ఎఫైర్స్ నడుపుతుంది. నచ్చిన వాడితో ఉంటే తప్పేంటి అంటుంది. దానికి తండ్రి కూడా ఆమె కరెక్ట్ అంటాడు. ఆయనది అదే బాపత్తు గనక ఇద్దరు తోడు దొంగలు.

శృతిహాసన్ ముంబైలో ఉంటుంది. శాంతాను హజారికా అని డూడల్ ఆర్టిస్టుతో ఆమె లివింగ్ రిలేషన్ తెలుగులో చెప్పాలంటే సహజీవనం కొనసాగిస్తోంది అంటే ఒకే ఇంట్లో ఉంటున్నారు అన్నమాట. శాంతను హజారికాతో సన్నిహితంగా దిగిన ఫోటోలు శృతి తరచుగా ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఎలాంటి దాపరికలు లేకుండా తన ప్రేమ కహాని గురించి ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. వారికి కూడా దిశానిర్దేశం చేస్తూ ఉంటుంది. మార్గదర్శిగా వాళ్ల‌ను తన బాటలో నడిపేలా చూస్తూ ఉంటుంది. అయితే ఇటీవల శృతి హఠాత్తుగా శాంతాను హజారికాతో కూడా విడిపోయింద‌ని కథనాలు వస్తున్నాయి. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ దానికి బ‌లం చేకూరుస్తోంది. అది ఈ ఊహగానాలకు కారణమైంది.

శృతి ఇన్‌స్టాగ్రామ్‌లో.. చివరకు నాకు అర్థమైంది ఏందంటే నాతో నేను ఉండటం సంతోషం ఇస్తుంది. నా ఒంటరితనాన్ని, నా సమయాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఇక్కడి వరకు రావడం వెనుక దేవుని దయ ఉంది. ఆయనకు కృతజ్ఞతలు… అంటూ కామెంట్ చేసింది. ఒంటరితనాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పడం వెనుక శృతి ఆంతర్యం ఏమిటనే సందేహాలు మొదలయ్యాయి.

నాకు నేనే తోడుగా ఉండటమే మంచిదని తెలుసుకున్నాను అని శృతి చెప్పడానికి కారణం బ్రేకప్పే అంటున్నారు. ఈ వార్తలపై శృతి ఇంకా స్పందించలేదు. శృతి గతంలో మైకెల్ కాస్ట్లే అని లండన్ వ్యక్తితో ప్రేమాయణం నడిపి ఆ తర్వాత బ్రేకప్ చెప్పింది. సిద్ధార్ధ్‌, ధనుష్‌లు ఎలాగూ ముందు వరుసలోనే ఉన్నారు. మరి తదుపరి కృష్ణుడు ఎవరు? ఈ రాధమ్మకు జోడైన కొత్త కృష్ణుడు ఎవడై ఉంటాడు? అనేది కాలమే నిర్ణయించాలి.

Exit mobile version